బాహు బలంన్యూస్ హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వం అనుసరిస్తున్న రైతు వ్యతిరేక విధానాలపై పోరాటాన్ని ఉధృతం చేస్తూ, ఈనెల 28వ తేదీన కరీంనగర్ జిల్లా కేంద్రంలో నిర్వహించనున్న ‘రాష్ట్ర స్థాయి రైతు మహాగర్జన సమరభేరి’ బహిరంగ సభకు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారకరామారావు (కేటీఆర్) తన సంపూర్ణ మద్దతు ప్రకటించారు. శనివారం హైదరాబాద్లోని తన నివాసంలో రైతు ప్రజాసంఘాల సమాఖ్య జాతీయ అధ్యక్షుడు పోలాడి రామారావు, ఓసీ జేఏసీ రాష్ట్ర అధ్యక్షుడు గోపు జైపాల్ రెడ్డి నేతృత్వంలోని ప్రతినిధి బృందం కేటీఆర్ను మర్యాదపూర్వకంగా కలిసింది. ఈ సందర్భంగా రైతు మహాగర్జన సభకు సంబంధించిన ఆహ్వాన పత్రాన్ని అందజేయగా, కేటీఆర్ ఎంతో సానుకూలంగా స్పందించి సభకు సంబంధించిన గోడ ప్రతులను (పోస్టర్లను) స్వయంగా ఆవిష్కరించారు. అన్నదాతల హక్కుల కోసం, వారికి ఇచ్చిన హామీల సాధన కోసం నిర్వహిస్తున్న ఈ పోరాటంలో రైతులకు తమ పార్టీ అండగా ఉంటుందని కేటీఆర్ ఈ సందర్భంగా హామీ ఇచ్చారు. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న రైతాంగం ఎదుర్కొంటున్న ఇబ్బందులను ఆయనకు వివరించగా, క్షేత్రస్థాయిలో రైతుల పక్షాన నిలబడాల్సిన అవసరం ఉందని ఆయన నేతలతో పేర్కొన్నారు.
హామీల అమలులో ప్రభుత్వ వైఫల్యంపై నిరసన..
అనంతరం హిమాయత్నగర్లో రైతు ప్రజాసంఘాల జాతీయ, రాష్ట్ర కమిటీల అత్యవసర సమావేశం జరిగింది. ఈ సమావేశంలో పోలాడి రామారావు మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం రైతాంగాన్ని నిలువునా వంచిస్తోందని మండిపడ్డారు. బడ్జెట్లో వ్యవసాయ రంగానికి నిధులు తగ్గించడమే కాకుండా, కౌలు రైతులకు ఇచ్చిన హామీలను పూర్తిగా విస్మరించారని ధ్వజమెత్తారు. అన్ని రకాల పంటలకు క్వింటాలుకు రూ.500 బోనస్ ఇస్తామని చెప్పి, నేడు కేవలం సన్న రకాలకే పరిమితం చేస్తూ రైతులను మభ్యపెడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతు భరోసా నిధులను ఇప్పటికే రెండుసార్లు ఎగ్గొట్టిన ప్రభుత్వం, ఇప్పుడు నామమాత్రపు నిధులతో రైతులను మోసం చేస్తోందని విమర్శించారు. అన్నదాతలకు, విద్యార్థులకు, వివిధ కుల సంఘాలకు ఇచ్చిన వాగ్దానాలను నెరవేర్చడంలో ప్రభుత్వం అనుసరిస్తున్న నిర్లక్ష్య ధోరణిని ఎండగట్టడమే ఈ సభ ప్రధాన ఉద్దేశమని వారు స్పష్టం చేశారు.
రాజకీయాలకతీతంగా కరీంనగర్ గడ్డపై భారీ శక్తి ప్రదర్శన..
ఈ నెల 28న కరీంనగర్ వేదికగా సుమారు రెండు లక్షల మందితో నిర్వహించబోయే ఈ మహాగర్జన సభ ఏ ఒక్క పార్టీకో పరిమితం కాదని, రాజకీయాలకు అతీతంగా రైతులందరి గొంతుకగా నిలుస్తుందని నేతలు వెల్లడించారు. ఇప్పటికే వివిధ జిల్లాల బాధ్యులకు ప్రచార సామగ్రి, గోడ ప్రతులు, కరపత్రాలను అందజేశామని, ప్రతి గ్రామం నుంచి రైతులు తరలివచ్చి సభను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో రైతు ప్రజాసంఘాల జేఏసీ రాష్ట్ర కన్వీనర్ గుమ్మదవెల్లి శ్రీనివాస్, ఆర్య వైశ్య మహాసభ రాష్ట్ర అధ్యక్షుడు అమరవాది లక్ష్మీనారాయణ, ఓసీ జేఏసీ గౌరవ అధ్యక్షులు గంగు ఉపేంద్ర శర్మ, రాష్ట్ర ఉపాధ్యక్షులు పెండ్యాల రాంరెడ్డి, నాయకులు గోళ్ళ రాధాకృష్ణమూర్తి, మాశెట్టి వరప్రసాద్, బోయినపల్లి నర్సింగరావు, తాళ్ళపల్లి రమేష్, రాయపూడి రవికుమార్, బూర్ల పుల్లారావు తదితరులు పాల్గొన్నారు

ఆర్యవైశ్య మహాసభ అధ్యక్షుడిని మర్యాదపూర్వకంగా కలిసిన పోలాడి రామారావు
రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ అధ్యక్షుడు అమరవాది లక్ష్మీనారాయణను శనివారం హైదరాబాద్లోని రాష్ట్ర కార్యాలయంలో ఓసి ఐకాస మరియు రైతు ప్రజాసంఘాల జేఏసీ జాతీయ అధ్యక్షుడు పోలాడి రామారావు మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఆయనకు పుష్పగుచ్ఛం అందజేసి శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం ప్రస్తుత సామాజిక అంశాలతో పాటు రైతాంగ సమస్యలపై చర్చించారు. సామాజిక సేవా కార్యక్రమాల్లో ఉమ్మడి భాగస్వామ్యం, భవిష్యత్తు కార్యాచరణపై కూడా వారు తమ అభిప్రాయాలను పంచుకున్నారు. ఈ కార్యక్రమంలో పలువురు సంఘం ప్రతినిధులు, ముఖ్య నాయకులు పాల్గొన్నారు.











