బాహు బలంన్యూస్ హన్మకొండ, ఏప్రిల్ 16:
రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల వేళ ఇచ్చిన హామీలను అమలు చేయడంలో తీవ్ర నిర్లక్ష్యం వహిస్తోందని రైతు ప్రజాసంఘాల సమాఖ్య జాతీయ అధ్యక్షుడు పోలాడి రామారావు మండిపడ్డారు. రైతులు, విద్యార్థులు, నిరుద్యోగులు ఇలా వివిధ వర్గాల సమస్యలను పట్టించుకోవడంలో సర్కారు విఫలమైందని ఆయన విమర్శించారు. ఈనెల 28వ తేదీన కరీంనగర్ వేదికగా నిర్వహించ తలపెట్టిన ‘రాష్ట్ర స్థాయి రైతుల మహా గర్జన – సమర భేరి’ సభకు సంబంధించిన ఆహ్వాన పత్రికలను గురువారం హన్మకొండలో విడుదల చేశారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు, పరకాల మాజీ ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి, అఖిల భారత పద్మశాలి సంఘాల జేఏసీ చైర్మన్ గూడూరి చంద్రశేఖర్లను వారి నివాసాల్లో కలిసి సభకు ఆహ్వానించారు. రైతుల పక్షాన నిలిచే ఈ పోరాట సభకు తమ సంపూర్ణ మద్దతు ఉంటుందని, ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా పార్టీలకతీతంగా ప్రజలు తరలివచ్చి సభను విజయవంతం చేయాలని వారు పిలుపునిచ్చారు.
ప్రభుత్వ వైఫల్యాలపై ప్రశ్నల వర్షం..
ఈ సందర్భంగా పోలాడి రామారావు మాట్లాడుతూ రైతు ప్రభుత్వం అని గొప్పలు చెప్పుకొనే పాలకులు, వారి సంక్షేమాన్ని గాలికొదిలేశారని ధ్వజమెత్తారు. వ్యవసాయానికి బడ్జెట్ కేటాయింపులు ఎందుకు తగ్గించారని, 2 లక్షల రుణమాఫీలో ఇంకా 70 శాతం మంది అర్హులకు ఎందుకు పూర్తి చేయలేదని నిలదీశారు. ఇప్పటికే రెండు సార్లు ఎగ్గొట్టిన రైతు భరోసా నిధులను ఎప్పుడు విడుదల చేస్తారో చెప్పాలని డిమాండ్ చేశారు. అన్ని పంటలకు రూ. 500 బోనస్ ఇస్తామన్న హామీ ఏమైందని, విద్యార్థుల ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలను ఎందుకు నిలిపివేశారని ప్రశ్నించారు. 50 ఏళ్లు నిండిన రైతులకు రూ. 6 వేల పెన్షన్, పాల ఉత్పత్తిదారులకు ఇచ్చే లీటరుకు రూ. 4 రాయితీ అమలుపై స్పష్టత ఇవ్వాలని డిమాండ్ చేశారు. అలాగే ప్రకృతి వైపరీత్యాలతో నష్టపోయిన పంటలను పూర్తిస్థాయిలో కొనుగోలు చేయాలని, ఉపాధి హామీ పథకాన్ని వ్యవసాయ రంగానికి అనుసంధానం చేయడంలో జాప్యం చేయకూడదని సూచించారు.
కరీంనగర్కు లక్షలాదిగా రైతాంగం..
ఏప్రిల్ 28న కరీంనగర్లో జరగనున్న ఈ మహా గర్జన సభకు రాష్ట్రవ్యాప్తంగా సుమారు రెండు లక్షల మంది హాజరవుతారని ఐకాస ప్రకటించింది. ఉమ్మడి కరీంనగర్ జిల్లా నుంచే 50 వేల మంది, వరంగల్ నుంచి 20 వేలు, మెదక్ నుంచి 15 వేలు, నిజామాబాద్ నుంచి 10 వేలు, ఆదిలాబాద్ జిల్లాల నుంచి 5 వేల మంది తరలిరానున్నారు. ఈ సభకు 30 వేల మంది మహిళలు, 10 వేల మంది యువత ప్రత్యేకంగా హాజరవుతున్నట్లు తెలిపారు. కరీంనగర్ జిల్లాలోని మానకొండూర్, చొప్పదండి, హుస్నాబాద్, హుజురాబాద్ నియోజక వర్గాల నుంచి 800 ట్రాక్టర్లు, 1500 బస్సులు మరియు ఇతర ప్రైవేట్ వాహనాల ద్వారా రైతులు స్వచ్ఛందంగా తరలివచ్చేందుకు ఏర్పాట్లు పూర్తి చేసినట్లు వివరించారు. ఈ కార్యక్రమంలో ఐకాస నాయకులు నరసింహా రెడ్డి, భిక్షపతి, సురేందర్ రెడ్డి, సదానందం, మహేష్ బాబు, రాంబాబు తదితరులు పాల్గొన్నారు.












