బాహు బలంన్యూస్ హుజూరాబాద్, ఏప్రిల్ 14: ఆపదలో ఉన్న వారికి ప్రాణదానం చేయడం కంటే గొప్ప కార్యం మరొకటి లేదని అంబేద్కర్ యువజన సంఘం ఉపాధ్యక్షుడు, ధర్మ సమాజ్ పార్టీ మండల అధ్యక్షుడు మంద రాజ్ అన్నారు. మంగళవారం హుజూరాబాద్ నియోజకవర్గ విద్యుత్ శాఖ మరియు రెడ్ క్రాస్ సొసైటీ సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహించిన మెగా రక్తదాన శిబిరంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు.
విద్యుత్ శాఖ ఆధ్వర్యంలో ఇలాంటి బృహత్తర కార్యక్రమాన్ని చేపట్టడం పట్ల ఆయన హర్షం వ్యక్తం చేశారు. అనంతరం మంద రాజ్ మాట్లాడుతూ.. సమాజంలో రక్త నిల్వల కొరతను తీర్చడంలో యువత కీలక పాత్ర పోషించాలని పిలుపునిచ్చారు. బాధ్యత గల పౌరులుగా ప్రతి ఒక్కరూ స్వచ్ఛందంగా రక్తదానానికి ముందుకు రావాలని కోరారు. రక్తదానం వల్ల ప్రాణాలు కాపాడవచ్చని, ఇది ఆరోగ్యానికి కూడా ఎంతో మేలు చేస్తుందని ఆయన పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో విద్యుత్ శాఖ ఉన్నతాధికారులు, రెడ్ క్రాస్ ప్రతినిధులు మరియు పలువురు యువజన సంఘాల నాయకులు పాల్గొని రక్తదాతలను అభినందించారు.










