బాహు బలంన్యూస్ హుజురాబాద్ ఏప్రిల్ 14,
ప్రజల ఆరోగ్యాన్ని ఫణంగా పెడుతూ నివాస ప్రాంతాలకు సమీపంలో ఏర్పాటు చేస్తున్న డంపింగ్ యార్డ్ ప్రాజెక్టును తక్షణమే రద్దు చేయాలని రైతు ప్రజాసంఘాల సమాఖ్య జాతీయ అధ్యక్షుడు పోలాడి రామారావు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. గౌడ సంఘం ఆధ్వర్యంలో గత 20 రోజులుగా కొనసాగుతున్న నిరసన దీక్షలకు ఆయన మద్దతు ప్రకటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రజల ఇష్టాయిష్టాలతో సంబంధం లేకుండా ఏకపక్షంగా ప్రభుత్వం నిర్ణయాలు తీసుకోవడం ప్రజాస్వామ్య విరుద్ధమని మండిపడ్డారు.
23రోజులుగా కొనసాగుతున్న పోరు..
ఈ ప్రాంత ప్రజల ప్రయోజనాలను పక్కనపెట్టి, పర్యావరణానికి ముప్పు కలిగించే డంపింగ్ యార్డ్ను ఇక్కడ నిర్మించడం సరికాదని రామారావు పేర్కొన్నారు. గత 23 రోజులుగా మహిళలు, వృద్ధులు, యువత రోడ్లపైకి వచ్చి శాంతియుతంగా నిరసన తెలుపుతున్నా పాలకులు స్పందించకపోవడం దారుణమన్నారు. ప్రజాభిప్రాయాన్ని గౌరవించి, ఇక్కడి సమస్య తీవ్రతను అర్థం చేసుకుని ప్రాజెక్టును నిలిపివేయాలని ఆయన కోరారు.
ప్రభుత్వానికి వారం రోజుల గడువు.
ప్రభుత్వం ఇప్పటికైనా మొండివైఖరి వీడాలని, వారం రోజుల్లోగా డంపింగ్ యార్డ్ను రద్దు చేస్తున్నట్లు అధికారిక ప్రకటన విడుదల చేయాలని రామారావు స్పష్టం చేశారు. ఒకవేళ ప్రభుత్వం కాలయాపన చేస్తే చూస్తూ ఊరుకోబోమని హెచ్చరించారు. ప్రజా క్షేత్రంలో తలపెట్టిన ఈ పోరాటాన్ని ప్రభుత్వం విస్మరిస్తే.. రానున్న రోజుల్లో ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని తెలిపారు.
ముట్టడికి సిద్ధం కావాలి.
వచ్చే వారం రోజుల్లో ప్రభుత్వం నుంచి సానుకూల స్పందన రాని పక్షంలో, జిల్లా వ్యాప్తంగా ఉన్న రైతు, ప్రజా సంఘాలను ఏకం చేసి ప్రభుత్వ కార్యాలయాలను ముట్టడిస్తామని ఆయన హెచ్చరించారు. ప్రజల ప్రాణాలతో చెలగాటమాడే ఏ ప్రాజెక్టునైనా అడ్డుకుంటామని, బాధితులకు అండగా నిలబడతామని పోలాడి రామారావు భరోసా ఇచ్చారు. ఈ కార్యక్రమంలో గౌడ సంఘం ప్రతినిధులు, బాధితులు మరియు అధిక సంఖ్యలో గ్రామస్థులు పాల్గొన్నారు.











