బాహు బలంన్యూస్ హుజురాబాద్, ఏప్రిల్ 14:
భారత రాజ్యాంగ నిర్మాత, భారతరత్న డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ రూపొందించిన రాజ్యాంగం ఈ దేశానికి అసలైన దిక్సూచి అని రైతు ప్రజాసంఘాల సమాఖ్య జాతీయ అధ్యక్షుడు పోలాడి రామారావు కొనియాడారు. మంగళవారం డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ 135వ జయంతిని పురస్కరించుకుని హుజురాబాద్ పట్టణంలోని ప్రధాన కూడలి
అంబేద్కర్ చౌరస్తా (బస్టాండ్ సెంటర్) వద్ద ఉన్న అంబేద్కర్ విగ్రహానికి వివిధ ప్రజా సంఘాల నాయకులతో కలిసి ఆయన పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.
అనంతరం అంబేద్కర్ జయంతి కమిటీ ఆధ్వర్యంలో జరిగిన సభలో రామారావు మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేశారు..
నవ సమాజ నిర్మాణమే అంబేద్కర్ లక్ష్యం.
సమాజంలో విభిన్న వర్గాల మధ్య అంతరాలు తొలగాలని, సమానత్వం, స్వేచ్ఛ, భావ వ్యక్తీకరణతో కూడిన నవ సమాజం నిర్మితం కావాలని అంబేద్కర్ ఆకాంక్షించారని ఆయన పేర్కొన్నారు. వ్యక్తిగత కష్టాలను, అవమానాలను ఎదుర్కొని ఉన్నత విద్యను అభ్యసించి, దేశానికి దిశానిర్దేశం చేసే రాజ్యాంగాన్ని అందించిన మహోన్నత వ్యక్తి అని కొనియాడారు. ఆయన జీవితం ప్రతి ఒక్కరికీ ఆదర్శప్రాయమని, ఆయన దార్శనికత వల్లే రాజ్యాంగబద్ధంగా ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు సాధ్యమైందని గుర్తుచేశారు.
సమన్యాయమే ధ్యేయం..రిజర్వేషన్లపై స్పష్టత.
ఆర్థికంగా వెనుకబడిన అగ్రవర్ణ పేదల (EWS) కోసం కేంద్రం కల్పించిన 10 శాతం రిజర్వేషన్లు అంబేద్కర్ ఆశించిన సమన్యాయం ప్రాతిపదికనే సాధ్యమయ్యాయని రామారావు తెలిపారు. తాము ఏ వర్గానికి వ్యతిరేకం కాదని, అయితే మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా రిజర్వేషన్ల ఫలాలు నిజమైన పేదలకు అందాలంటే ఎస్సీ, ఎస్టీ, బీసీ రిజర్వేషన్లలో ‘క్రిమీలేయర్’ పద్ధతిని అమలు చేసేందుకు ప్రత్యేక చట్టం తీసుకురావాలని డిమాండ్ చేశారు.
ఏప్రిల్ 28న ‘రైతు మహా గర్జన’
అంబేద్కర్ ఆలోచనా విధానానికి అనుగుణంగా హక్కుల సాధన కోసం పోరాడాల్సిన అవసరం ఉందన్నారు. పాలకులు ఇచ్చిన హామీలను విస్మరిస్తే గట్టిగా ప్రశ్నించాలని పిలుపునిచ్చారు. అన్నదాతల న్యాయమైన డిమాండ్ల సాధనకై, ఓసి ఐకాస మరియు రైతు ప్రజాసంఘాల సమాఖ్య సంయుక్త ఆధ్వర్యంలో ఈ నెల 28వ తేదీ (మంగళవారం) సాయంత్రం 3 గంటలకు కరీంనగర్ ఎస్.ఆర్.ఆర్ (SRR) డిగ్రీ కళాశాల మైదానంలో చారిత్రాత్మక ‘రాష్ట్ర వ్యాప్త రైతు మహా గర్జన’ నిర్వహిస్తున్నట్లు ప్రకటించారు. ఈ సమర భేరి సభకు పార్టీలకతీతంగా రాష్ట్రవ్యాప్తంగా రైతులు, ప్రజలు లక్షలాదిగా తరలివచ్చి జయప్రదం చేయాలని ఆయన హృదయపూర్వకంగా ఆహ్వానించారు.
ఈ కార్యక్రమంలో పలు ప్రజా సంఘాల నాయకులు, రైతు సంఘం ప్రతినిధులు మరియు అంబేద్కర్ జయంతి కమిటీ సభ్యులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.











