బాహు బలంన్యూస్ హుజూరాబాద్ మార్చి 29 :
హుజూరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి దళిత ప్రజాప్రతినిధుల పట్ల వ్యవహరిస్తున్న తీరు సభ్య సమాజం తలదించుకునేలా ఉందని యూత్ కాంగ్రెస్ నాయకులు మండిపడ్డారు. దళిత ఎమ్మెల్యేల పట్ల ఆయన చేస్తున్న అనుచిత వ్యాఖ్యలను నిరసిస్తూ ఆదివారం హుజూరాబాద్ పట్టణంలోని అంబేద్కర్ చౌరస్తాలో నియోజకవర్గ యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు చల్లూరి రాహుల్ ఆధ్వర్యంలో కౌశిక్ రెడ్డి దిష్టిబొమ్మను దహనం చేశారు. ఈ సందర్భంగా నియోజకవర్గంలోని వివిధ గ్రామాల నుంచి తరలివచ్చిన కార్యకర్తలు కౌశిక్ రెడ్డి వైఖరికి వ్యతిరేకంగా పెద్ద పెట్టున నినాదాలు చేశారు.
రాజకీయ అనుభవాన్ని గౌరవించలేని వ్యక్తి ఎమ్మెల్యేగా అనర్హుడు
అనంతరం జరిగిన విలేకరుల సమావేశంలో చల్లూరి రాహుల్ మాట్లాడుతూ.. కౌశిక్ రెడ్డికి మొదటి నుంచి దళితులంటే చిన్నచూపు ఉందని ధ్వజమెత్తారు. “పార్టీలతో సంబంధం లేకుండా అందరూ గౌరవించే సీనియర్ నాయకుడు, మాజీ ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి పట్ల కౌశిక్ రెడ్డి వీధి రౌడీలా వ్యవహరించడం సిగ్గుచేటు. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్తో సమానమైన రాజకీయ అనుభవం గల శాసనసభ్యునిపై నోరు పారేసుకోవడం ఆయన అహంకారానికి పరాకాష్ట” అని మండిపడ్డారు. కౌశిక్ రెడ్డి ప్రవర్తన ప్రజాస్వామ్య వ్యవస్థకే మచ్చ అని, అటువంటి వ్యక్తి శాసనసభలో ఉండేందుకు ఏమాత్రం అర్హుడు కాదని, తక్షణమే ఆయన సభ్యత్వాన్ని రద్దు చేయాలని డిమాండ్ చేశారు.
బేషరతుగా క్షమాపణ చెప్పాలని హెచ్చరిక
కౌశిక్ రెడ్డి తన తీరు మార్చుకోకపోతే నియోజకవర్గంలో ఆయనను అడుగుపెట్టనివ్వబోమని నాయకులు హెచ్చరించారు. తక్షణమే దళిత సమాజానికి, కడియం శ్రీహరికి బేషరతుగా క్షమాపణ చెప్పాలని, లేనిపక్షంలో నిరసనలను రాష్ట్రవ్యాప్తంగా ఉధృతం చేస్తామని హెచ్చరించారు. బాధ్యతాయుతమైన పదవిలో ఉండి దళిత ఎమ్మెల్యేలను అవమానించడం అంటే యావత్ దళిత జాతినే అవమానించడమేనని ఆవేదన వ్యక్తం చేశారు.
ఈ నిరసన కార్యక్రమంలో 9వ వార్డు కౌన్సిలర్ సమ్మన్న, నియోజకవర్గ నాయకులు సందమల్ల నరేష్, సందమల్ల బాబు, యూత్ కాంగ్రెస్ జనరల్ సెక్రెటరీలు చిట్యాల రేవంత్, కందుల సందీప్, మండల ఉపాధ్యక్షుడు సందీప్, అసెంబ్లీ ఉపాధ్యక్షురాలు నాగమణి, కె.ఆర్. గౌడ్, రవితేజ, తిరుమల్, అజిత్, కొండ్ర అనిల్, విజయ్ తో పాటు భారీ సంఖ్యలో యూత్ కాంగ్రెస్ కార్యకర్తలు పాల్గొన్నారు.











