బాహు బలంన్యూస్ హుజురాబాద్, ఫిబ్రవరి 07:
హుజురాబాద్ మున్సిపల్ ఎన్నికల రణక్షేత్రంలో 25వ వార్డు ప్రచారం హోరెత్తుతోంది. వార్డు సమగ్ర అభివృద్ధి లక్ష్యంగా, విద్యావంతురాలైన తనను ఆశీర్వదించాలని భారతీయ జనతా పార్టీ అభ్యర్థిని కొండ ప్రశాంతి – మురళి మంచికట్ల ఓటర్లను అభ్యర్థించారు. శనివారం వార్డులోని పలు వీధుల్లో ఇంటింటికీ తిరుగుతూ ఆమె ముమ్మరంగా ప్రచారం నిర్వహించారు.
ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, తాను ఓటును కేవలం ఒక హక్కుగా కాకుండా, వార్డు భవిష్యత్తును మార్చే ఆయుధంగా భావిస్తున్నానని తెలిపారు. “నేను మీ ముందుకు వచ్చింది సానుభూతి కోసం కాదు.. మార్పు కోసం, నన్ను నేను నిరూపించుకునే అవకాశం కోసం” అంటూ ఓటర్లను ఉద్దేశించి ఉద్వేగభరితంగా ప్రసంగించారు. ఉన్నత విద్యావంతురాలిగా రాజకీయాల్లోకి రావడం వెనుక ఒకే ఒక ఆశయం ఉందని, అది తన వార్డు ప్రజలకు గౌరవప్రదమైన జీవనాన్ని, మెరుగైన సౌకర్యాలను కల్పించడమేనని ఆమె స్పష్టం చేశారు.
సేవకు ప్రతీకగా నిలుస్తా..
మాటల రాజకీయాలకు తాను దూరమని, కేవలం పనితోనే సమాధానం చెప్పే సేవకురాలిగా గుర్తింపు తెచ్చుకుంటానని ప్రశాంతి భరోసా ఇచ్చారు. గతంలో ఎందరినో రాజకీయంగా ఆదరించిన 25వ వార్డు ప్రజలు, ఈసారి మార్పును కోరుకుంటున్నారని, తనలాంటి చదువుకున్న వ్యక్తికి అవకాశం ఇస్తే వార్డును ఆదర్శంగా తీర్చిదిద్దుతానని హామీ ఇచ్చారు. కష్టాల్లో తోడుగా ఉంటూ, ప్రతి ఇంటా సుఖసంతోషాలు నింపడమే తన ప్రథమ కర్తవ్యమని పేర్కొన్నారు.
కమలం పువ్వు గుర్తుపై ఓటు వేయండి:
వార్డులో నెలకొన్న సమస్యల పరిష్కారానికి, పారదర్శకమైన పాలన అందించడానికి సీరియల్ నంబర్ 1 కలిగిన కమలం పువ్వు గుర్తుపై ఓటు వేసి, భారీ మెజారిటీతో గెలిపించాలని ఆమె విజ్ఞప్తి చేశారు. ఈ ప్రచారంలో మురళి మంచికట్లతో పాటు స్థానిక బీజేపీ నాయకులు, కార్యకర్తలు మరియు వార్డు ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.










