బాహు బలంన్యూస్, హుజురాబాద్,ఆగస్టు 18:
జర్నలిస్టుల సమస్యలు పరిష్కారమయ్యేంత వరకు వారికి అండగా ఉంటామని ఓసీ జేఏసీ రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు పూసల ప్రభావతి రెడ్డి స్పష్టం చేశారు. హుజురాబాద్ ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో ఇళ్ల స్థలాల సాధన కోసం చేపట్టిన రిలే నిరాహార దీక్షలు మంగళవారం నాటికి మూడో రోజుకు చేరాయి. ఈ సందర్భంగా దీక్షా శిబిరాన్ని సందర్శించిన ఆమె జర్నలిస్టులకు సంపూర్ణ మద్దతు ప్రకటించారు.
గత ప్రభుత్వం జర్నలిస్టులకు కేటాయించిన ఇళ్ల పట్టాలపై కాంగ్రెస్ నేత గూడూరి స్వామి రెడ్డి కోర్టులో కేసు వేయడం అన్యాయమని, కక్షసాధింపు చర్యలను మానుకుని తక్షణమే ఆ కేసును విత్డ్రా చేసుకోవాలని ఆమె డిమాండ్ చేశారు. అర్హులైన పాత్రికేయులందరికీ వెంటనే స్థలాలు కేటాయించి రిజిస్ట్రేషన్ ప్రక్రియ పూర్తి చేయాలని ప్రభుత్వాన్ని కోరారు. జర్నలిస్టుల న్యాయపోరాటానికి ఓసీ జేఏసీ సంపూర్ణ సహకారం అందిస్తుందని ఆమె భరోసా ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ప్రెస్ క్లబ్ ప్రతినిధులు, జర్నలిస్టులు పాల్గొన్నారు.











