బాహు బలంన్యూస్ హుజురాబాద్ ఆగస్టు 01:
ప్రాథమిక పాఠశాల ఉపాధ్యాయులకు నిర్వహించిన రెండో విడత సమగ్ర అంతర్గత (ఇంటిగ్రేటెడ్ ఇన్-సర్వీస్) శిక్షణ తరగతులు శనివారంతో ముగిశాయి. ఈ వివరాలను మండల విద్యాధికారి (ఎంఈవో) విడపు శ్రీనివాస్ ఒక ప్రకటనలో తెలిపారు.
గత నెల 30న ప్రారంభమైన ఈ మూడు రోజుల శిక్షణలో 39 మంది ఉపాధ్యాయులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎంఈవో మాట్లాడుతూ.. చదువులో వెనుకబడిన విద్యార్థులను గుర్తించి వారికి తెలుగు, ఆంగ్లం, గణితం విషయాల్లో ప్రత్యేక (రెమిడియల్) బోధన అందించి ఉత్తమ ఫలితాలు సాధించేలా ప్రోత్సహించాలని సూచించారు. శిక్షణలో నేర్చుకున్న అంశాలను ఉపాధ్యాయులు తరగతి గదుల్లో తప్పనిసరిగా అమలు చేయాలని కోరారు.
ఈ కార్యక్రమంలో హెచ్ఎం ఊరుగొండ సత్యప్రసాద్, రిసోర్స్ పర్సన్లు అల్లి శ్రీనివాస్, పట్టేం శ్రీనివాస్, తంగళ్లపల్లి శ్రీనివాస్, సీఆర్పీ అమరేందర్ తదితరులు పాల్గొన్నారు.











