బాహు బలంన్యూస్ కరీంనగర్ జూన్ 12; రేవంత్ సర్కార్ పగ్గాలు చేపట్టి రెండున్నరేళ్లు దాటుతున్నా, ఇచ్చిన హామీల అమలులో నిర్లక్ష్యం వీడి తక్షణమే వాటిని నెరవేర్చాలని రైతు జేఏసీ అధ్యక్షులు పోలాడి రామారావు డిమాండ్ చేశారు. శుక్రవారం కరీంనగర్లో ప్రజా సంఘాల నాయకులతో కలిసి పోలాడి రామారావు మీడియాతో మాట్లాడుతూ ఒక ప్రకటన విడుదల చేశారు. రైతులకు అన్ని పంటలకు రూ. 500 బోనస్ ఇస్తామని చెప్పి, ఇవ్వకుండా మాట తప్పారని ఆయన విమర్శించారు. రైతు కూలీలకు రూ. 12 వేలు, కౌలు రైతులకు రూ. 15 వేలు ఇస్తామన్న డబ్బుల ఊసే లేదని, రుణమాఫీని కూడా అరకొరగా చేసి వదిలేశారని మండిపడ్డారు.
ఇప్పటికే రెండు విడతల భరోసా నిధులను ఎగ్గొట్టిన సర్కార్.. యాసంగి సీజన్ ముగిసినా కేవలం కంటితుడుపుగా రెండు ఎకరాలకే భరోసా డబ్బులు ఇచ్చిందని, మిగతా 80 శాతం విడుదల చేయకుండా చేతులెత్తేసిందని ఆరోపించారు. ఖరీఫ్ సీజన్ మొదలై రైతులు ముమ్మరంగా సాగు పనులు చేసుకుంటున్న ఈ తరుణంలో.. ఖరీఫ్ రైతు భరోసా నిధుల విడుదలపై ఎలాంటి ప్రకటన చేయకపోవడం వల్ల అన్నదాతల్లో ఆందోళన మొదలైందన్నారు. ప్రైవేట్ దళారులకు మేలు చేసేందుకు కొనుగోలు కేంద్రాల్లో 40 రోజులు జాప్యం చేసి రైతులను తీవ్ర ఇబ్బందులకు గురి చేశారని, తరుగు, రవాణా పేరుతో రైతుల నుంచి రూ. 1200 కోట్లను నిలువునా దోపిడీ చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎరువుల పంపిణీలో ‘యాప్’ పేరుతో రైతులను ఇబ్బందులకు గురి చేస్తున్నారని, డిస్కమ్ల పేరుతో విద్యుత్ పంపిణీ రంగాన్ని ప్రైవేట్ పరం చేయడానికి రంగం సిద్ధం చేస్తున్నారని మండిపడ్డారు.
రెవెన్యూ రంగంలో జవాబుదారీతనం లేకపోవడం వల్ల సామాన్యులు ఇక్కట్ల పాలవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. రైతుల సహకార సంఘాల్లో నామినేటెడ్ పద్ధతి తీసుకురావడం దారుణమని, రైతుల నీటి వినియోగదారుల వ్యవస్థను మూలన పడేశారని విమర్శించారు. అలాగే నిరుద్యోగులకు ఇచ్చిన హామీల అమలుపై కనీస దృష్టి పెట్టకుండా పక్కన పడేశారన్నారు.
డిమాండ్ల సాధనకు కరీంనగర్లో త్వరలో లక్షలాది మందితో, పార్టీలకతీతంగా నిర్వహించ తలపెట్టిన రాష్ట్ర స్థాయి ‘రైతు మహాగర్జన సమరభేరి’ సభను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఈ సభ ద్వారా ప్రభుత్వంపై సమర శంఖం పూరించి, హామీల అమలులో వారి నిర్లక్ష్యాన్ని ఎండగట్టి కళ్లు తెరిపిస్తామని రామారావు పేర్కొన్నారు. ప్రభుత్వం ఎన్ని అడ్డంకులు సృష్టించినా వెనక్కి తగ్గేదే లేదని, ఇచ్చిన హామీలను అమలు చేసే వరకు ప్రభుత్వాన్ని గుక్కతిప్పుకోనివ్వకుండా, తెలంగాణ ఉద్యమ తరహాలో గర్జనలా ఉద్యమిస్తామని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో ప్రజా సంఘాల నాయకులు కరివేద సుధాకర్ రెడ్డి, కొత్తకొండ రవీందర్ రావు, అండెం రమణారెడ్డి, విక్రమసింహారావు, సంపత్ రెడ్డి, జిల్లా అంజయ్య తదితరులు పాల్గొన్నారు.












