బాహు బలంన్యూస్ కరీంనగర్ , జూన్ 10:
మలిదశ తెలంగాణ ఉద్యమకారుడు, ఓసీ జేఏసీ జాతీయ నేత మురళీధర్ దేశ్పాండే ఆకస్మిక మరణం యావత్ తెలంగాణ సమాజానికి, ప్రజా సంఘాలకు తీరని లోటని ప్రజా సంఘాల జేఏసీ జాతీయ అధ్యక్షుడు పోలాడి రామారావు తీవ్ర విచారం వ్యక్తం చేశారు. బుధవారం హైదరాబాద్లోని తన నివాసంలో దేశ్పాండే గుండెపోటుతో కన్నుమూశారు. ఈ విషయం తెలుసుకున్న ప్రజా సంఘాల నాయకులు దిగ్భ్రాంతికి లోనయ్యారు. బుధవారం కరీంనగర్ నగరంలోని తెలంగాణ చౌక్లో ప్రజా సంఘాల ఆధ్వర్యంలో దేశ్పాండే సంతాప సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా దేశ్పాండే చిత్రపటానికి ప్రజా నాయకులతో కలిసి పోలాడి రామారావు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.
రాజకీయాలకతీతంగా ఉద్యమించిన నేత
ఈ సందర్భంగా పోలాడి రామారావు మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్ర సాధన కోసం జరిగిన మలిదశ ఉద్యమంలో దేశ్పాండే అత్యంత క్రియాశీలక పాత్ర పోషించారని కొనియాడారు. రాజకీయాలకతీతంగా సమాజంలోని అన్ని వర్గాలను ఒకే తాటిపైకి తీసుకురావడంలో ఆయన చూపిన చొరవ అమోఘమైనదన్నారు. ఆర్థికంగా వెనుకబడిన ఓసీ సామాజిక వర్గాలలోని పేద విద్యార్థులకు విద్య, ఉద్యోగ రంగాల్లో రిజర్వేషన్లు దక్కాలనే లక్ష్యంతో, ఓసీ జేఏసీ ఆధ్వర్యంలో రాష్ట్ర, జాతీయ స్థాయిల్లో ఏళ్లతరబడి సాగిన పోరాటాల్లో ఆయన జాతీయ సలహాదారుడిగా ఉధృతమైన పాత్ర పోషించారని గుర్తుచేసుకున్నారు.
రైతు సమస్యలపై అలుపెరుగని పోరాటం
ఈ నెల 14న కరీంనగర్ లో రైతు సమస్యల పరిష్కారం కోసం నిర్వహించ తలపెట్టిన ‘సమరభేరి’ బహిరంగ సభను విజయవంతం చేయడానికి మురళీధర్ దేశ్పాండే గత కొన్ని రోజులుగా వివిధ జిల్లాల్లో విస్తృతంగా పర్యటించారని పోలాడి తెలిపారు. గ్రామగ్రామాన తిరుగుతూ రైతులను జాగృతం చేస్తూ యాక్టివ్గా ఉన్న ఆయన, ఇంతలోనే ఆకస్మిక మరణం చెందడం జీర్ణించుకోలేకపోతున్నామంటూ పోలాడి రామారావు భావోద్వేగానికి లోనై కన్నీటిపర్యంతమయ్యారు.
సేవా రంగంలో అజరామరం
కళాకారుల సంక్షేమం కోసం నిరంతరం కృషి చేసిన సాంస్కృతిక యోధుడిగా దేశ్పాండే చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోతారని లీడర్లు కొనియాడారు. జీవితాంతం ప్రజా సేవయే ధ్యేయంగా బతికిన ఆయన, తన జీవిత చరమాంకంలో అనాథాశ్రమాన్ని ఏర్పాటు చేసి, దిక్కులేని వారికి అండగా నిలిచారని ప్రశంసించారు. అనాథల్లో ఆత్మవిశ్వాసం నింపుతూ ఆయన చేసిన సామాజిక సేవ అద్వితీయమని, అజరామరమని పేర్కొన్నారు.
ట్యాంక్ బండ్పై విగ్రహం పెట్టాలి
ఉద్యమకారుడిగా, సామాజిక సేవకుడిగా, కళాకారుల మిత్రుడిగా, గొప్ప మానవతావాదిగా బహుముఖ సేవలు అందించిన దేశ్పాండే పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తూ, వారి కుటుంబ సభ్యులకు ప్రజా సంఘాల తరపున ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. తెలంగాణ సమాజానికి ఆయన చేసిన సేవలకు గుర్తింపుగా హైదరాబాద్ ట్యాంక్ బండ్పై మురళీధర్ దేశ్పాండే విగ్రహాన్ని ప్రతిష్టించాలని, వారి కుటుంబానికి ప్రభుత్వం అన్ని విధాలా అండగా నిలవాలని ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డికి పోలాడి రామారావు విజ్ఞప్తి చేశారు. అలాగే, ఆయన జ్ఞాపకార్థం ప్రజా సంఘాల ఆధ్వర్యంలో కరీంనగర్లోని కేబుల్ బ్రిడ్జ్ (తీగల వంతెన) ముఖద్వారం వద్ద దేశ్పాండే విగ్రహాన్ని నెలకొల్పుతామని ఈ సందర్భంగా నాయకులు ప్రకటించారు.
ఈ సంతాప నివాళుల కార్యక్రమంలో విశ్వహిందూ పరిషత్ (VHP) రాష్ట్ర గోశాల సంపర్క్ ప్రముఖ్ ఉట్కూరి రాధాకృష్ణారెడ్డి, బ్రాహ్మణ ప్రజా సంఘాల జేఏసీ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ దీపక్ బాబు, ప్రజా సంఘాల ముఖ్య నాయకులు జంపాల నర్సయ్య, ఇల్లందుల తిరుమల, పెండ్యాల కేశవరెడ్డి, చెన్నమనేని పురుషోత్తం రావు, అండెం రమణా రెడ్డి, గుండం భూమయ్య, కొత్తకొండ రవీందర్ రావు, తాటిపల్లి రాజన్న, కొలగూరి రాజేశ్వర్ రావు తదితరులు పాల్గొని నివాళులర్పించారు.











