బాహు బలంన్యూస్ హుజూరాబాద్, సెప్టెంబర్. 08 : దళిత వర్గానికి చెందిన శాసనసభాపతి గడ్డం ప్రసాద్ కుమార్పై బీఆర్ఎస్ ఎమ్మెల్సీ తాతా మధు చేసిన అనుచిత వ్యాఖ్యలు అత్యంత హేయమైన చర్య అని చెల్పూర్ సర్పంచ్ వంతడుపుల కస్తూరి తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. చట్టసభలో కాకుండా రోడ్లపై పోలీసులతో ఘర్షణకు దిగిన నాయకులను అడ్డుకున్నందుకు స్పీకర్పై అనుచితంగా మాట్లాడటం దుర్మార్గమన్నారు. దమ్ముంటే అసెంబ్లీలో ప్రజా సమస్యలపై చర్చల్లో పాల్గొనాలని, ఇలాంటి చిల్లర రాజకీయాలతో ప్రజల్లో చులకన కావద్దని హితవు పలికారు.
తాతా మధు తీరుతో బీఆర్ఎస్ పార్టీకి దళితుల పట్ల ఉన్న చిన్నచూపు, నిర్లక్ష్య వైఖరి మరోసారి బహిర్గతమైందని ఆమె మండిపడ్డారు. దొర పోకడలను అసహ్యించుకుని ప్రజలు ఎన్నికల్లో ఆ పార్టీని ఘోరంగా ఓడించినా, వారి అహంకారం ఏమాత్రం తగ్గలేదనడానికి ఈ ఘటనే నిదర్శనమని విమర్శించారు.
ఈ ఉదంతంపై బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ తక్షణమే స్పందించి స్పీకర్ గడ్డం ప్రసాద్కు బహిరంగ క్షమాపణ చెప్పాలని ఆమె డిమాండ్ చేశారు. అలాగే శాసనమండలి నిబంధనలను ఉల్లంఘించిన ఎమ్మెల్సీ తాతా మధును పదవి నుంచి వెంటనే బర్తరఫ్ చేయాలని మండలి ఛైర్మన్కు సిఫారసు చేయాలన్నారు. ప్రజా సమస్యలపై చర్చలు జరగాల్సిన సభలో అల్లర్లు సృష్టిస్తున్న బీఆర్ఎస్ నేతలు ఇప్పటికైనా కుటిల రాజకీయాలు మాని, రాష్ట్ర ప్రజలకు బేషరతుగా క్షమాపణలు చెప్పాలని స్పష్టం చేశారు.











