బాహు బలంన్యూస్ హుజూరాబాద్, సెప్టెంబర్ 06:మండలంలోని తుమ్మనపల్లి గ్రామంలో త్రైత సిద్ధాంత ప్రబోధ సేవాసమితి, ఇందూ జ్ఞాన వేదిక కరీంనగర్ శాఖ ఆధ్వర్యంలో శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలను ఆదివారం అత్యంత భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. గ్రామ పంచాయతీ ప్రాంగణంలో ప్రత్యేక వేదికను తీర్చిదిద్ది శ్రీకృష్ణుడి ప్రతిమను ప్రతిష్ఠించారు. ఉదయం స్వామివారికి జ్ఞాన రీత్యా ప్రత్యేక పూజలు, భగవద్గీత శ్లోక పారాయణం చేశారు.
మధ్యాహ్నం 2 గంటలకు స్థానిక ఎస్సై, ఎంఈవోలు ముఖ్య అతిథులుగా హాజరై శ్రీకృష్ణుడి ‘ఊరు ఎరిగింపు’ (ఊరేగింపు) రథయాత్రను ప్రారంభించారు. సాయంత్రం 6 గంటల వరకు పురవీధుల్లో సాగిన ఈ శోభాయాత్రలో భక్తులు, గ్రామస్థులు పెద్ద సంఖ్యలో పాల్గొని దర్శించుకున్నారు. నేటి ఊరేగింపుతో కృష్ణాష్టమి ఉత్సవాలు ముగిశాయి.
ఈ సందర్భంగా సమితి సభ్యులు మాట్లాడుతూ.. దేవుడే మనిషిగా అవతరిస్తే భగవంతుడని అంటారని, అలాంటి జగద్గురువు శ్రీకృష్ణుడేనని స్పష్టం చేశారు. పౌర్ణమి, అమావాస్యల మధ్య అష్టమి తిథిన జన్మించి జ్ఞానాజ్ఞానాలకు వారధిగా నిలిచిన కృష్ణ భగవానుడి అసలైన తత్త్వాన్ని ప్రజలందరికీ ఎరుకపరచడానికే ఈ ‘ఊరు ఎరిగింపు’ కార్యక్రమాన్ని చేపట్టినట్లు వివరించారు.
కార్యక్రమంలో ఉత్సవ కమిటీ ప్రతినిధి రవీంద్రరెడ్డి, సభ్యులు శ్రీధర్, వేణు, పృథ్వీరెడ్డి, పురుషోత్తంరెడ్డి, రాజయ్య, నక్షత్రరెడ్డి, ఉమాదేవి, దివ్య, లీలారాణి, ఉషారాణి, ఆరాధ్య, హానితో పాటు సమితి ప్రతినిధులు, గ్రామ పెద్దలు పాల్గొన్నారు.











