బాహు బలంన్యూస్ హుజూరాబాద్, సెప్టెంబర్ 08 :
రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ దళితులను తీవ్రంగా విస్మరించి, వారి సంక్షేమాన్ని పూర్తిగా గాలికొదిలేసిందని ఉపసర్పంచ్ల ఫోరం అధ్యక్షుడు వన్నాల శివాజీ మండిపడ్డారు. మాటలతో కాలయాపన చేయడం ఆపి, దమ్ముంటే రాష్ట్రవ్యాప్తంగా ‘దళితబంధు’ పథకాన్ని పకడ్బందీగా అమలు చేసి దళితులపై తమకున్న చిత్తశుద్ధిని నిరూపించుకోవాలని కాంగ్రెస్ పాలకులకు సవాల్ విసిరారు.
మంగళవారం హుజూరాబాద్లో ఆయన విలేకరులతో మాట్లాడారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు దళితుల ఆర్థిక స్వావలంబన కోసం దేశంలో ఎక్కడా లేని విధంగా ‘దళితబంధు’ను ప్రవేశపెట్టారని గుర్తుచేశారు. హుజూరాబాద్ నియోజకవర్గాన్ని పైలట్ ప్రాజెక్టుగా ఎంపిక చేసి, ఒక్కో కుటుంబానికి ఎలాంటి పూచీకత్తు లేకుండా రూ.10 లక్షల చొప్పున ఆర్థిక సహాయాన్ని అందించి వారిని అభివృద్ధి పథంలో నిలిపిన ఘనత కేసీఆర్కే దక్కుతుందన్నారు. దళితులను ఆర్థికంగా ఉన్నత స్థానంలో నిలబెట్టిన చరిత్ర నాటి ప్రభుత్వానిదని స్పష్టం చేశారు.
అసెంబ్లీలో దళిత స్పీకర్ను అవమానించారంటూ కాంగ్రెస్ నేతలు ప్రగల్భాలు పలకడం విడ్డూరంగా ఉందని ఎద్దేవా చేశారు. దళితుల ఓట్లతో గద్దెనెక్కిన కాంగ్రెస్, అధికారంలోకి వచ్చాక వారికి చేసిందేమీ లేదని విమర్శించారు. కాంగ్రెస్ నేతలకు దళితులపై నిజంగా ప్రేమ ఉంటే, హుజూరాబాద్ నియోజకవర్గంలో మిగిలిపోయిన లబ్ధిదారులందరికీ వెంటనే రెండో విడత దళితబంధు నిధులను మంజూరు చేయాలని డిమాండ్ చేశారు. అదేవిధంగా తెలంగాణ వ్యాప్తంగా ఉన్న అర్హులైన ప్రతి దళిత కుటుంబానికీ ఈ పథకాన్ని వర్తింపజేయాలన్నారు.
దళితుల అభ్యున్నతి కోసం పైసా సాయం చేయని కాంగ్రెస్ ప్రభుత్వానికి, వారి గురించి మాట్లాడే నైతిక హక్కు లేదని స్పష్టం చేశారు. ఇప్పటికైనా రాజకీయ విమర్శలు మానుకుని, రాష్ట్రవ్యాప్తంగా దళితబంధు పథకాన్ని అమలు చేసి తమ నిజాయతీని చాటుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. లేనిపక్షంలో దళిత సమాజం కాంగ్రెస్ ప్రభుత్వానికి తగిన బుద్ధి చెబుతుందని హెచ్చరించారు.











