బాహు బలంన్యూస్ హుజూరాబాద్, సెప్టెంబర్ 08:
రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వ నిరంకుశ పాలన నానాటికీ పెరిగిపోతోందని ఓసీ జేఏసీ రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు పూసల ప్రభావతి రెడ్డి తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. అసెంబ్లీ సాక్షిగా బీఆర్ఎస్ మహిళా ఎమ్మెల్యేలను పోలీసులు అవమానించడాన్ని తీవ్రంగా ఖండిస్తూ, బీఆర్ఎస్ మహిళా విభాగం చేపట్టిన ధర్నాకు ఓసీ జేఏసీ సంపూర్ణ మద్దతు ప్రకటిస్తున్నట్లు ఆమె స్పష్టం చేశారు.
ఈ సందర్భంగా పూసల ప్రభావతి రెడ్డి మాట్లాడుతూ… ప్రజా సమస్యలపై గళమెత్తుతున్న మహిళా శాసనసభ్యులపై పోలీసులు వ్యవహరించిన తీరు అత్యంత హేయమని, ఇది ప్రజాస్వామ్యానికే గొడ్డలిపెట్టు అని మండిపడ్డారు. పాలకుల అండ చూసుకుని ఖాకీలు హద్దులు దాటి ప్రవర్తిస్తే ఊరుకునేది లేదని హెచ్చరించారు. మహిళల ఆత్మగౌరవాన్ని దెబ్బతీసేలా ప్రవర్తిస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వానికి ప్రజలు తగిన గుణపాఠం చెప్పడం ఖాయమన్నారు.
మహిళా ప్రజాప్రతినిధులపై నిర్బంధాలు ప్రయోగించడం తగదని, బాధిత ఎమ్మెల్యేలకు వెంటనే క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. మహిళా హక్కుల పరిరక్షణ కోసం, ప్రజావ్యతిరేక కాంగ్రెస్ పాలనపై బీఆర్ఎస్ చేస్తున్న ఈ పోరాటానికి ఓసీ జేఏసీ ఎల్లవేళలా అండగా నిలుస్తుందని పూసల ప్రభావతి రెడ్డి తేల్చిచెప్పారు.










