బాహు బలంన్యూస్ హుజురాబాద్ సెప్టెంబర్ 05:విద్యార్థుల భవిష్యత్తును తీర్చిదిద్దుతూ సమాజ నిర్మాణంలో కీలక పాత్ర పోషిస్తున్న గురువులే నిజమైన శిల్పులని ఓసీ జేఏసీ (OC JAC) రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు పూసల ప్రభావతి రెడ్డి కొనియాడారు. భారత మాజీ రాష్ట్రపతి, తత్వవేత్త, ఆదర్శ ఉపాధ్యాయులు డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ జయంతి (ఉపాధ్యాయ దినోత్సవం) సందర్భంగా ఆమె ఉపాధ్యాయ లోకానికి హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు.
ఈ సందర్భంగా పూసల ప్రభావతి రెడ్డి మాట్లాడుతూ… “ఉపాధ్యాయుడు ఒక గొప్ప పుస్తకం లాంటివారు; ఆ పుస్తకాన్ని చదివిన ప్రతి ఒక్కరి జీవితం జ్ఞానదీపమై ప్రకాశిస్తుంది” అని పేర్కొన్నారు. విద్యార్థులలోని ప్రతిభను వెలికితీసి, వారిని ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్దే గురువుల సేవలు వెలకట్టలేనివని, సమాజం వారి త్యాగాలను ఎప్పటికీ మరువలేదని అన్నారు. డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ బోధనలు, ఆదర్శాలు నేటి తరానికి నిరంతరం స్ఫూర్తిదాయకమని ఆమె స్పష్టం చేశారు.











