బాహు బలంన్యూస్ కమలాపూర్, సెప్టెంబర్ 04
రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ పాలన పూర్తిగా విఫలమైందని, ఎన్నికల ముందు మహిళలకు ఇచ్చిన హామీలను తుంగలో తొక్కి నిలువునా మోసం చేసిందని ఓసీ జేఏసీ రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు ప్రభావతి రెడ్డి తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. కాంగ్రెస్ పాలన వైఫల్యాలకు నిరసనగా, ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి పిలుపు మేరకు కమలాపూర్ మండల కేంద్రంలో బీఆర్ఎస్ శ్రేణులు శుక్రవారం భారీ నిరసన ర్యాలీ, వంటా-వార్పు కార్యక్రమాన్ని నిర్వహించాయి.
ఈ సందర్భంగా ప్రభావతి రెడ్డి మాట్లాడుతూ, అధికారంలోకి వచ్చి ఇన్ని రోజులైనా కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజా సంక్షేమాన్ని గాలికొదిలేసిందని మండిపడ్డారు. ముఖ్యంగా కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ లబ్ధిదారులకు ఇస్తామన్న తులం బంగారాన్ని ఎగ్గొట్టారని ఆగ్రహం వ్యక్తం చేశారు. మహాలక్ష్మి పథకం కింద అర్హులైన మహిళలకు నెలకు రూ.2,500 ఇస్తామని హామీ ఇచ్చి విస్మరించారని, విద్యార్థినులకు ఉచిత స్కూటర్ల పంపిణీ ఊసే లేకుండా పోయిందని విమర్శించారు.
కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పటికైనా మహిళలకు ఇచ్చిన ప్రతి హామీని తక్షణమే అమలు చేయాలని ఆమె డిమాండ్ చేశారు. లేనిపక్షంలో మహిళల పక్షాన పెద్ద ఎత్తున ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు, మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొని కాంగ్రెస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.










