బాహు బలంన్యూస్ ఎల్కతుర్తి, సెప్టెంబర్,01:
గత బీఆర్ఎస్, కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వాలు అవలంబించిన ప్రజా వ్యతిరేక విధానాల వల్లే రాష్ట్రంలో అర్హులైన పేదలకు ఏళ్ల తరబడి రేషన్ కార్డులు అందలేదని జిల్లా కాంగ్రెస్ సీనియర్ నాయకుడు శనిగరపు వెంకటేష్ విమర్శించారు. ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి నేతృత్వంలోని ప్రజా ప్రభుత్వం సంక్షేమ పథకాలను నేరుగా ప్రజల వద్దకే చేరుస్తూ ‘ఇందిరమ్మ రాజ్యం’ లక్ష్యాలను నెరవేరుస్తోందని పేర్కొన్నారు.
మంగళవారం ఎల్కతుర్తి మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. రాష్ట్ర మంత్రి పొన్నం ప్రభాకర్ చొరవతో మండలంలో అర్హులైన 1,400 మంది లబ్ధిదారులకు నూతన స్మార్ట్ రేషన్ కార్డులను మంజూరు చేసి పంపిణీ చేశామని తెలిపారు. పేదల ఆకలి తీర్చి, పౌష్టికాహారాన్ని అందించేందుకు ప్రభుత్వం ద్వారా సన్నబియ్యం పంపిణీ చేపడుతున్నట్లు చెప్పారు.
మండలంలో రేషన్ కార్డు లేని అర్హులైన పేద కుటుంబం ఉండకూడదన్నదే తమ లక్ష్యమని, కలెక్టర్ నుంచి క్షేత్రస్థాయి అధికారుల వరకు పారదర్శకంగా విధులు నిర్వహిస్తూ ప్రతి ఒక్కరికీ సంక్షేమ ఫలాలు అందేలా చూస్తున్నారని కొనియాడారు.
ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ గ్రామ శాఖ అధ్యక్షుడు శీలం అనిల్కుమార్, ఇందిరమ్మ కమిటీ సభ్యుడు కడారి సురేందర్, సీనియర్ యూత్ కాంగ్రెస్ నాయకుడు అంచనగిరి వెంకటరమణ, నాయకులు ఎలకంటి అరుణ, కొమ్మిడి కల్పనాదేవి, గొల్లె రాధ, అల్లం భాగ్య, ప్రమీలారెడ్డి, కందాల మొగిలి, బోనగిరి నాగరాజు తదితరులు పాల్గొన్నారు.










