బాహు బలంన్యూస్ హుజురాబాద్ ,ఆగస్టు 29 :
తెలుగు భాష మన సంస్కృతి, సంప్రదాయాలు మరియు ఆత్మగౌరవానికి ప్రతీక అని ఓసీ జేఏసీ రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు పూసల ప్రభావతి రెడ్డి పేర్కొన్నారు. ఆగస్టు 29న వ్యవహారిక భాషోద్యమ పితామహుడు గిడుగు వెంకట రామమూర్తి జయంతి సందర్భంగా జరుపుకునే ‘తెలుగు భాషా దినోత్సవం’ను పురస్కరించుకుని ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు ప్రజలందరికీ ఆమె హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు.
ఈ సందర్భంగా పూసల ప్రభావతి రెడ్డి మాట్లాడుతూ… “అక్షరం అద్భుతం – తెలుగు భాష మహోద్భుతం” అని కొనియాడారు. ‘మా భాష – మా గౌరవం – మా తెలంగాణ’ అనే నినాదంతో ప్రతి ఒక్కరూ మాతృభాష ఔన్నత్యాన్ని చాటాలని, మన సంస్కృతిని కాపాడుకోవాలని పిలుపునిచ్చారు.
ఆధునిక కాలంలో ఇతర భాషల ప్రాధాన్యం ఉన్నప్పటికీ, మన మూలాలైన మాతృభాషను ఎప్పటికీ విస్మరించకూడదని ఆమె స్పష్టం చేశారు. నేటి యువత, భావితరాలకు మన తెలుగు భాష మాధుర్యాన్ని, గొప్పతనాన్ని అందించాల్సిన బాధ్యత సమాజంలో ప్రతి ఒక్కరిపై ఉందని ఆమె ఉద్ఘాటించారు. ప్రతి ఇంటా తెలుగు వెలుగులు నింపాలని ఆమె ఆకాంక్షించారు.










