బాహు బలంన్యూస్ హైదరాబాద్ ఆగస్టు 25 :
సీపీఎం రాష్ట్ర సీనియర్ నేత, అఖిల భారత కిసాన్ సభ ఉపాధ్యక్షులు, ఉమ్మడి రాష్ట్ర రైతు సంఘం మాజీ అధ్యక్షులు కామ్రేడ్ సారంపల్లి మల్లారెడ్డి అకాల మరణం రైతాంగానికి, శ్రామిక వర్గానికి తీరని లోటని ఓసీ సామాజిక సంఘాల సమాఖ్య నాయకులు పేర్కొన్నారు.
హైదరాబాద్ ఆర్టీసీ క్రాస్రోడ్స్లోని సీపీఎం రాష్ట్ర కార్యాలయం బసవపున్నయ్య భవన్లో ఉంచిన మల్లారెడ్డి పార్థివ దేహానికి ఓసీ జేఏసీ జాతీయ అధ్యక్షులు పోలాడి రామారావు, రాష్ట్ర అధ్యక్షులు గోపు జైపాల్ రెడ్డి, వర్కింగ్ ప్రెసిడెంట్ తాడిశెట్టి పశుపతి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.
ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ.. రైతాంగ సమస్యలపై సమగ్ర అధ్యయనం చేసి, వాటి పరిష్కారానికి అలుపెరగని పోరాటాలు సాగించిన విజ్ఞాన ఖని మల్లారెడ్డి అని కొనియాడారు. గోదావరి, కృష్ణా నదీ జలాల పంపిణీలో తెలంగాణ ప్రాంతానికి జరిగిన అన్యాయంపై అనేక వేదికల ద్వారా ప్రజలను చైతన్యపరిచారని గుర్తుచేశారు. అదేవిధంగా కాజీపేట రైల్వే కోచ్ ఫ్యాక్టరీ సాధన కోసం ఆయన ఉధృత పోరాటాలు చేశారని పేర్కొన్నారు.
మల్లారెడ్డి కుటుంబ సభ్యులకు, సీపీఎం శ్రేణులకు ఓసీ జేఏసీ జాతీయ, రాష్ట్ర కమిటీల తరఫున నాయకులు తమ ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు










