బాహు బలంన్యూస్ హుజురాబాద్ ఆగస్టు 31:
గత నెల రోజులుగా నిలిచిపోయిన ఆర్టీసీ కార్గో సేవలు, నూతన టెండర్ ప్రక్రియ పూర్తవడంతో తిరిగి పునఃప్రారంభమయ్యాయి. స్థానిక బస్టాండ్ ఆవరణలో ఏర్పాటు చేసిన కార్గో కేంద్రాన్ని డిపో మేనేజర్ (డీఎం) రవీంద్రనాథ్, పీసీసీ (PCC) ఏజెంట్, కార్గో నిర్వాహకులు గూటం ప్రశాంత్ ఆధ్వర్యంలో రిబ్బన్ కట్ చేసి లాంఛనంగా ప్రారంభించారు.
ఈ సందర్భంగా డీఎం రవీంద్రనాథ్ మాట్లాడుతూ, పాత టెండర్ గడువు ముగియడంతో తాత్కాలికంగా ఆగిన కార్గో సేవలను, తాజా టెండర్ ప్రక్రియ పూర్తి చేసుకుని ప్రజలకు మరింత వేగవంతంగా అందించేందుకు పునరుద్ధరించినట్లు తెలిపారు. వ్యాపారులు, సామాన్య ప్రజల సరుకులను అత్యంత భద్రంగా, తక్కువ చార్జీలతో గమ్యస్థానాలకు చేరవేసేందుకు ఆర్టీసీ కార్గో ఎంతో నమ్మకమైనదని పేర్కొన్నారు. ప్రైవేట్ ట్రావెల్స్, కొరియర్ సంస్థలతో పోలిస్తే ఆర్టీసీ కార్గో ఎంతో విశ్వసనీయమైనదని, స్థానిక ప్రజలు, వ్యాపారులు ఈ సేవలను సద్వినియోగం చేసుకోవాలని కోరారు.
ఈ కార్యక్రమంలో హుజురాబాద్ డిపో సీఐ (కంట్రోలర్ ఇన్స్పెక్టర్) అంజలి, కార్గో నిర్వాహకులు గూటం ప్రశాంత్, డిపో పర్యవేక్షక అధికారులు, ఆర్టీసీ డ్రైవర్లు, కండక్టర్లు, గ్యారేజ్ సిబ్బందితో పాటు కార్గో విభాగ సిబ్బంది పాల్గొన్నారు.












