బాహు బలంన్యూస్,కరీంనగర్ ఆగస్టు 30 :
ఎన్నికల సమయంలో ఇచ్చిన వాగ్దానాలను తుంగలో తొక్కుతూ రాష్ట్ర ప్రభుత్వం తీవ్ర నిర్లక్ష్య వైఖరి ప్రదర్శిస్తోందని ఓసీ జేఏసీ మండిపడుతోంది. నామమాత్రపు ప్రకటనలతో సరిపెడుతూ క్షేత్రస్థాయిలో సమస్యలను విస్మరిస్తున్న పాలకుల తీరును ఎండగట్టేందుకు పోరుబాటకు సిద్ధమవుతోంది. ఇందులో భాగంగా ఈ నెల 8న హైదరాబాద్లోని ఇందిరాపార్కు ధర్నాచౌక్ వద్ద రాష్ట్ర రెడ్డి సంఘాల సమన్వయ కమిటీ ఆధ్వర్యంలో తలపెట్టిన మహాధర్నాకు ఓసీ జేఏసీ సంపూర్ణ సంఘీభావం ప్రకటించింది. ఆదివారం కరీంనగర్లోని శ్రీనివాస హోటల్లో నిర్వహించిన ఉమ్మడి జిల్లా సన్నాహక సమావేశంలో జాతీయ అధ్యక్షుడు పోలాడి రామారావు పాల్గొని ప్రభుత్వ తీరుపై నిప్పులు చెరిగారు.
ప్రకటనలకే పరిమితమైన కార్పొరేషన్లు
రెడ్డి కార్పొరేషన్ ఏర్పాటు చేస్తున్నట్లు ప్రభుత్వం ఆర్భాటంగా ప్రకటించి చేతులు దులుపుకుందే తప్ప, ఇంతవరకు పూర్తిస్థాయి పాలకవర్గాన్ని నియమించలేదని, రూపాయి నిధులు కూడా కేటాయించలేదని నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. రెడ్డి కార్పొరేషన్తో పాటు ఇతర ఓసీ ఉపకులాల కార్పొరేషన్లకు సైతం కనీస బడ్జెట్ కేటాయించకుండా నిర్వీర్యం చేస్తున్నారని ధ్వజమెత్తారు. తక్షణమే రెడ్డి కార్పొరేషన్కు ₹1,000 కోట్ల నిధులు విడుదల చేసి, పూర్తిస్థాయి పాలకమండలిని ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు.
ఈడబ్ల్యూఎస్, ఫీజు బకాయిలపై పాలకుల ఉదాసీనత
విద్యా, ఉద్యోగ రంగాల్లో ఆర్థికంగా వెనుకబడిన వర్గాల (ఈడబ్ల్యూఎస్) 10 శాతం రిజర్వేషన్లను అన్ని విభాగాల్లో పకడ్బందీగా అమలు చేయడంలో ప్రభుత్వం విఫలమైందని ఐకాస నేతలు విమర్శించారు. ప్రభుత్వం వద్ద పెండింగ్లో ఉన్న సుమారు ₹12,000 కోట్ల విద్యార్థుల ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలను వెంటనే విడుదల చేయాలని కోరారు. ఖాళీగా ఉన్న ప్రభుత్వ ఉద్యోగాలను నోటిఫికేషన్ల ద్వారా యుద్ధప్రాతిపదికన భర్తీ చేయడంతో పాటు, రైతులకు భరోసానిచ్చే ‘రైతు బీమా’ పథకాన్ని ఎటువంటి ఆటంకాలు లేకుండా నిరంతరాయంగా కొనసాగించాలని స్పష్టం చేశారు.
చలో ఇందిరాపార్కుకు కదంతొక్కాలి
న్యాయమైన డిమాండ్ల సాధన కోసం ఈ నెల 8న ఇందిరాపార్కు వేదికగా జరిగే నిరసన దీక్షకు రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ఓసీ వర్గాలు, మేధావులు, యువత, ప్రజాసంఘాల నాయకులు భారీ సంఖ్యలో తరలివచ్చి విజయవంతం చేయాలని పోలాడి రామారావు పిలుపునిచ్చారు.
ఈ సన్నాహక భేటీలో ముఖ్య నాయకులు కేతిరి మణిశంకర్ రెడ్డి, అండెం రమణారెడ్డి, రూప్రెడ్డి సత్యనారాయణ రెడ్డి, తోపుచర్ల శ్రీనివాసరావు, కొత్తకొండ రవీందర్రావు, తాటిపల్లి రాజన్న, కంకణాల రాజిరెడ్డి, గన్ను నరసింహారెడ్డి, వెలమ రఘుపతి రెడ్డి తదితరులు పాల్గొన్నారు.










