బాహు బలంన్యూస్,కరీంనగర్, సెప్టెంబర్ 01:
రాష్ట్రంలో ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలను మూసివేసే కుట్రలను ప్రభుత్వం తక్షణమే విరమించుకోవాలని, ఇందుకు జారీ చేసిన జీవో 97ను బేషరతుగా రద్దు చేయాలని ప్రజా సంఘాల జాతీయ అధ్యక్షుడు పోలాడి రామారావు డిమాండ్ చేశారు. మంగళవారం కరీంనగర్ తెలంగాణ చౌక్లో మీడియా ప్రతినిధులతో మాట్లాడారు.
సాంకేతిక విద్యా రంగంలో పేద, మధ్యతరగతి విద్యార్థులకు భరోసానిచ్చే పాలిటెక్నిక్ వ్యవస్థను మహీంద్రా స్కిల్ యూనివర్సిటీలో విలీనం చేయాలని చూడటం దారుణమన్నారు. రాష్ట్రవ్యాప్తంగా పాలిటెక్నిక్ కళాశాలలకు వేల కోట్ల విలువైన ఆస్తులున్నాయని, ముఖ్యంగా హైదరాబాద్ మాసాబ్ట్యాంక్ కళాశాలకు ఉన్న రూ.5 వేల కోట్ల భూములపై ప్రైవేటు శక్తులు ఎప్పటినుంచో కన్నేశాయని ఆరోపించారు. ప్రభుత్వ కళాశాలలను బలోపేతం చేసేందుకు ప్రత్యేక నిధులు కేటాయించాలని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డికి బహిరంగ లేఖ రాసినట్లు పేర్కొంటూ, ఆ లేఖ ప్రతులను విడుదల చేశారు. ప్రభుత్వం తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకోకుంటే విద్యార్థులతో కలిసి రాష్ట్రవ్యాప్తంగా ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని హెచ్చరించారు.










