బాహు బలంన్యూస్ కరీంనగర్ ఆగస్టు 22:
తెలంగాణ వైతాళికుడు, నిరుపమాన సంఘ సంస్కర్త, నాటి హైదరాబాద్ నగర కొత్వాల్ (ప్రస్తుత పోలీస్ కమిషనర్ హోదా) రాజా బహదూర్ వెంకట్ రాంరెడ్డి సమాజానికి, విద్యా వికాసానికి చేసిన సేవలు అజరామరమని ఓసీ జేఏసీ జాతీయ అధ్యక్షుడు పోలాడి రామారావు కొనియాడారు. బడుగు, బలహీన, ఓసీ నిరుపేద విద్యార్థుల ఉన్నతి కోసం ఆయన చూపిన దాతృత్వం తరతరాలకు మార్గదర్శకమని పేర్కొన్నారు.
రాజా బహదూర్ వెంకట్ రాంరెడ్డి 157వ జయంతిని పురస్కరించుకుని శనివారం కరీంనగర్లోని ఎస్.ఆర్.ఆర్ ప్రభుత్వ డిగ్రీ కళాశాల ప్రధాన కూడలి వద్ద ఉన్న ఆయన కాంస్య విగ్రహానికి ఓసీ ఐకాస నాయకులతో కలిసి పోలాడి రామారావు ఘనంగా పూలమాలలు వేసి నివాళులర్పించారు.
ఈ సందర్భంగా పోలాడి రామారావు మాట్లాడుతూ.. బ్రిటిష్, నిజాం నవాబుల పరిపాలనా కాలంలో అత్యంత కీలకమైన పోలీస్ కొత్వాల్గా బాధ్యతలు నిర్వర్తించిన వెంకట్ రాంరెడ్డి, శాంతిభద్రతల పరిరక్షణలో తనదైన ముద్ర వేయడమే కాకుండా సామాన్య ప్రజల పక్షపాతిగా సేవలందించారని గుర్తుచేశారు. పేదరికం కారణంగా ఏ ఒక్క విద్యార్థీ ఉన్నత చదువులకు దూరం కాకూడదనే సదాశయంతో హైదరాబాద్ నడిబొడ్డున ప్రతిష్ఠాత్మక విద్యాసంస్థలు, ఉచిత వసతి గృహాలను (హాస్టళ్లు) నెలకొల్పారని తెలిపారు. కులమతాలకు అతీతంగా పేద విద్యార్థులందరికీ ఉచిత వసతి, నాణ్యమైన భోజనం, విద్యా సౌకర్యాలు కల్పించి భావితరాల భవిష్యత్తుకు బంగారు బాటలు వేశారని ప్రశంసించారు. ఆయన ఆశయ సాధనకు ప్రతి ఒక్కరూ కృషి చేయడమే నిజమైన నివాళి అని పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో ఉమ్మడి కరీంనగర్ జిల్లా, రాష్ట్ర ఓసీ జేఏసీ ప్రముఖ నాయకులు పెండ్యాల కేశవరెడ్డి, బండ గోపాల్రెడ్డి, పెండ్యాల రాంరెడ్డి, జున్నుతుల రాజిరెడ్డి, ఏనుగు చొక్కారెడ్డి, బీరెడ్డి కరుణాకర్రెడ్డి, కొత్తకొండ రవీందర్రావు, అండెం రమణారెడ్డి, జిల్లా అంజయ్య, వేముల సుదర్శన్రెడ్డి తదితరులు పాల్గొన్నారు.









