బాహు బలంన్యూస్ మానకొండూర్, ఆగస్టు 24:
రైతుల మధ్య ఏళ్ల తరబడి నెలకొన్న భూ సరిహద్దు వివాదాలకు శాశ్వత పరిష్కారం చూపేందుకే ప్రభుత్వం సమగ్ర డిజిటల్ సర్వేను చేపట్టిందని మానకొండూర్ మండల తహసీల్దార్ విజయ్కుమార్ పేర్కొన్నారు. మండలంలో సమగ్ర డిజిటల్ సర్వే కోసం ఎంపిక చేసిన ఐదు గ్రామాల్లో భాగంగా, సోమవారం వన్నారం గ్రామ శివారు రెవెన్యూ భూముల్లో సరిహద్దు డిజిటల్ సర్వేను ఆయన ప్రారంభించారు.
ఆలయంలో పూజలు.. సర్వేకు శ్రీకారం
వన్నారం, గంగిపల్లి గ్రామాల సరిహద్దుల్లో ఉన్న మల్లికార్జున స్వామి ఆలయంలో అర్చకులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఇరు గ్రామాల ప్రజల సమక్షంలో ఆధునిక డిజిటల్ పరికరాల ద్వారా సరిహద్దు పాయింట్ను గుర్తించి సర్వే ప్రక్రియకు శ్రీకారం చుట్టారు. డిజిటల్ సర్వేతో భూ వివాదాలకు తెరపడుతుందని, ప్రజాప్రతినిధులు, రైతులు భాగస్వాములు కావాలని తహసీల్దార్ కోరారు.
రైతులకు మేలు చేకూరాలి: పోలాడి రామారావు
ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న స్థానిక సీనియర్ సిటిజెన్, రైతు ప్రజా సంఘాల ఐకాస జాతీయ అధ్యక్షుడు పోలాడి రామారావు మాట్లాడుతూ.. డిజిటల్ సర్వేతో సరిహద్దు వివాదాలు సమసిపోయి అన్నదాతలకు ఎంతో ప్రయోజనం కలుగుతుందన్నారు. భూ సమస్యలు లేని గ్రామాలుగా తీర్చిదిద్దేందుకు రైతులందరూ సర్వే అధికారులకు పూర్తిస్థాయిలో సహకరించాలని ఆయన పిలుపునిచ్చారు.
హాజరైన ప్రజాప్రతినిధులు, అధికారులు
ఈ కార్యక్రమంలో మండల సర్వేయర్ జీవన్రెడ్డి, వన్నారం సర్పంచ్ తాళ్లపల్లి సంపత్, ఉపసర్పంచ్ బాకారపు రాములు, జీపీవో అధికారులు నర్సయ్య, వేణు, మార్కెట్ కమిటీ డైరెక్టర్ చలిగంటి ఓదెలు, సింగిల్ విండో డైరెక్టర్ తాళ్లపల్లి కొమురయ్య, మాజీ సర్పంచ్ బాకారపు శ్రీనివాస్, మాజీ ఉపసర్పంచ్ బాకారపు తిరుపతి, మాజీ ఎంపీటీసీలు గంగుల రవి, బండ సంపత్రెడ్డి, నాయకులు బనుక తిరుపతి, తాళ్లపల్లి తిరుపతి, పోలాడి యాదగిరిరావు, బాకారపు రమేశ్, జగన్మోహన్రావు, సాంబరవి, బండ కృష్ణారెడ్డి, నారాయణరెడ్డి, పరశురాములు, పంచాయతీ సిబ్బందితో పాటు ఇరు గ్రామాల రైతులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.










