బాహు బలంన్యూస్, సైదాపూర్: మండల పరిధిలోని వెక్కేపల్లి గ్రామం ఎస్సీ కమ్యూనిటీ హాల్ వద్ద నూతన వాటర్ ట్యాంక్ నిర్మాణ పనులకు గురువారం ఘనంగా భూమిపూజ నిర్వహించారు. దివంగత గడ్డం లక్ష్మి–కనకయ్య దంపతుల జ్ఞాపకార్థం వారి కుమారుడు, కోడలు గడ్డం సదానందం–సుమలత ప్రోత్సాహంతో, మనవడు మహేష్, మనవరాలు అనూష తమ సొంత ఖర్చులతో ఈ తాగునీటి ట్యాంక్ నిర్మాణాన్ని చేపట్టారు.
ముఖ్య అతిథిగా హాజరైన గడ్డం విశాల్
ఈ కార్యక్రమానికి అంబేద్కర్ సంఘం హుజూరాబాద్ డివిజన్ ఇన్ఛార్జ్ గడ్డం విశాల్ ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. నానమ్మ, తాత జ్ఞాపకార్థం ప్రజల దాహార్తిని తీర్చేందుకు యువత సొంత నిధులతో వాటర్ ట్యాంక్ నిర్మించడం అత్యంత స్ఫూర్తిదాయకమని ఆయన కొనియాడారు. ఇలాంటి సేవా కార్యక్రమాలు సమాజానికి ఎంతో ఆదర్శమని ప్రశంసించారు.
యువత సేవా దృక్పథం ఆదర్శనీయం: సర్పంచ్
గ్రామ సర్పంచ్ మునిపాల్ సునీత–రవి నిర్మాణ పనులను ప్రారంభిస్తూ, గ్రామాభివృద్ధిలో యువత భాగస్వామ్యం కావడం సంతోషకరమని పేర్కొన్నారు.
పాల్గొన్న ప్రజాప్రతినిధులు, గ్రామస్థులు
ఈ కార్యక్రమంలో వార్డు సభ్యులు గడ్డం కళ్యాణి, తూటి రమ్య, గ్రామ కారోబార్ గడ్డం రమేష్లతో పాటు గడ్డం కుటుంబ సభ్యులు, గ్రామ పెద్దలు, యువకులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు..












