బాహు బలంన్యూస్ హుజురాబాద్ మే 23;
కాంగ్రెస్ పార్టీలో ఏళ్ల తరబడి జెండా మోసి, ప్రజాసమస్యలపై పోరాడిన నిఖార్సైన నాయకులను విమర్శించే నైతిక హక్కు వలస పాలకులకు లేదని యూత్ కాంగ్రెస్ అసెంబ్లీ నియోజకవర్గ అధ్యక్షులు చల్లూరి రాహుల్ స్పష్టం చేశారు. కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతాలతో సంబంధం లేకుండా, పూటకో పార్టీ మారుస్తూ అధికార దాహంతో వచ్చిన టేకుల శ్రావణ్ అసలు కాంగ్రెస్ పార్టీ వ్యక్తే కాదని ఆయన తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.
శనివారం హైదరాబాద్లో చల్లూరి రాహుల్ విలేకరులతో మాట్లాడారు. మానకొండూరు నియోజకవర్గంలో పార్టీ నిబంధనలకు విరుద్ధంగా ఎస్సీ విభాగం పదవుల పంపకం జరిగిందంటూ తెలంగాణ స్టేట్ అట్రాసిటీ ఎస్సీ సెల్ మాజీ ఇన్చార్జ్ తిప్పారపు సంపత్ సాక్ష్యాధారాలతో సహా ప్రెస్ మీట్ పెట్టి ప్రశ్నించడాన్ని ఆయన గుర్తుచేశారు. ఈ వ్యవహారంపై టీపీసీసీ ఎస్సీ డిపార్ట్మెంట్ రాష్ట్ర చైర్మన్, మానకొండూరు ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ నేరుగా వివరణ ఇవ్వలేక, తన వద్ద ఉన్న తెలుగుదేశం పార్టీ (టీడీపీ) వలస నాయకులతో తిప్పారపు సంపత్పై పత్రికా ప్రకటనలు చేయించడం సిగ్గుచేటని మండిపడ్డారు. ఇది ఎమ్మెల్యే తన స్థాయిని దిగజార్చుకోవడమేనని విమర్శించారు.
పార్టీ నిబంధనలు తుంగలో తొక్కారు
టీపీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ గత నెలలో స్పష్టమైన आदेशాలు జారీ చేశారని చల్లూరి రాహుల్ ఈ సందర్భంగా గుర్తుచేశారు. పార్టీలో కనీసం మూడు సంవత్సరాలు క్రియాశీలకంగా పనిచేసిన వారికి మాత్రమే మండల అధ్యక్షులు లేదా ఇతర అధికారిక పదవులు ఇవ్వాలని అధిష్టానం చెబితే, ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ ఆ నిబంధనలను పూర్తిగా తుంగలో తొక్కారని ఆరోపించారు. నిన్న మొన్నటి వరకు ఇతర పార్టీల్లో ఉండి, నియోజకవర్గంలో కనీసం మూడు ఏళ్లు కూడా పూర్తికాని వలసదారులకు పదవులు కట్టబెట్టడాన్ని ప్రజాస్వామ్యబద్ధంగా ప్రశ్నిస్తే.. సమాధానం చెప్పలేక చిల్లర గ్యాంగ్తో ఆరోపణలు చేయిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
బీఆర్ఎస్, బీజేపీ ప్రజావ్యతిరేక విధానాలపై కాంగ్రెస్ పార్టీ తరఫున క్షేత్రస్థాయిలో పోరాడి, జైలుకు వెళ్లిన ఘన చరిత్ర తెలంగాణ స్టేట్ అట్రాసిటీ ఎస్సీ సెల్ మాజీ ఇన్చార్జ్ తిప్పారపు సంపత్కు ఉందని రాహుల్ కొనియాడారు. గత 18 సంవత్సరాలుగా పార్టీని నమ్ముకుని, విద్యార్థి ఉద్యమాలు, ఎన్ఎస్యూఐ (NSUI) స్థాయి నుంచి అంచలంచెలుగా ఎదిగిన నిబద్ధత గల నాయకుడు సంపత్ అని పేర్కొన్నారు.
”టేకుల శ్రావణ్.. నువ్వు అసలు కాంగ్రెస్ పార్టీ కోసం ఎక్కడ జెండా మోశావు? నీకు ఇచ్చిన కార్యదర్శి పదవి కూడా పార్టీ నిబంధనలకు పూర్తిగా వ్యతిరేకం. నువ్వు పార్టీలోకి వచ్చి కనీసం మూడు సంవత్సరాలు కూడా కాలేదు. శ్రావణ్, మీ ఎమ్మెల్యే కవ్వంపల్లి ఇద్దరూ టీడీపీ నుంచి కాంగ్రెస్లోకి వలస వచ్చినవారే. అలాంటిది దశాబ్దాలుగా పార్టీని నమ్ముకున్న వాళ్లను, అట్రాసిటీ ఎస్సీ సెల్ మాజీ ఇన్చార్జ్గా బాధ్యతలు నిర్వహించిన సంపత్ గారిని విమర్శిస్తారా? మీ ఇద్దరిదీ ఏ పార్టీనో నియోజకవర్గ ప్రజలందరికీ తెలుసు. ఇకపై పార్టీ కోసం కష్టపడిన వారిని ఒక్క మాట అన్నా సహించేది లేదు” అని చల్లూరి రాహుల్ హెచ్చరించారు.
బహిరంగ చర్చకు సిద్ధమా?
ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణపై తిప్పారపు సంపత్ చేసిన ఆరోపణలు, చూపించిన సాక్ష్యాధారాలు తప్పని నిరూపిస్తే తాము కరీంనగర్ చౌరస్తాలో ముక్కు నేలకు రాస్తామని చల్లూరి రాహుల్ సవాల్ విసిరారు. ఒకవేళ ఎమ్మెల్యే కవ్వంపల్లిది తప్పయితే ఆయన ముక్కు నేలకు రాస్తారా అని ప్రశ్నించారు. ఈ వ్యవహారంపై ఎక్కడైనా, ఎప్పుడైనా బహిరంగ చర్చకు రావాలని, తాము సిద్ధంగా ఉన్నామని ఆయన స్పష్టం చేశారు. వలస రాజకీయాలతో పార్టీని నష్టపరచాలని చూస్తే సహించే ప్రసక్తే లేదని ఈ సందర్భంగా హెచ్చరించారు.










