బాహు బలంన్యూస్ హైదరాబాద్, మే 23: రాష్ట్ర ప్రభుత్వం రైతులకు ఇచ్చిన ఎన్నికల హామీలను నెరవేర్చడంలో పూర్తిగా విఫలమైందని, అన్నదాతల పట్ల అవలంబిస్తున్న నిరంకుశ వైఖరికి నిరసనగా ఈనెల 30వ తేదీన కరీంనగర్లో రెండు లక్షల మందితో రాష్ట్ర స్థాయి ‘రైతుల మహాగర్జన సమరభేరి’ సభను నిర్వహించనున్నట్లు రైతు ప్రజాసంఘాల జేఏసీ జాతీయ అధ్యక్షుడు పోలాడి రామారావు ప్రకటించారు. శనివారం హైదరాబాద్లోని ఒక ప్రముఖ హోటల్లో వివిధ జిల్లాల రైతు సంఘాల ప్రతినిధులు, రాష్ట్ర నాయకులతో కలిసి సన్నాహక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సభకు సంబంధించిన రవాణా, జన సమీకరణ ఏర్పాట్లపై కో-ఆర్డినేటర్లతో ఆయన సుదీర్ఘంగా సమీక్షించారు.
సగం మందికే రుణమాఫీ.. రైతు భరోసా ఎక్కడ?
అనంతరం పోలాడి రామారావు మాట్లాడుతూ.. ప్రభుత్వం వెంటనే తన నిర్లక్ష్య వైఖరిని వీడి రైతులకు ఇచ్చిన హామీలను అమలు చేయాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో ప్రభుత్వానికి పుట్టగతులు ఉండవని హెచ్చరించారు. “రూ. 2 లక్షల రుణమాఫీ పథకాన్ని కేవలం సగం మందికే వర్తింపజేసి, మిగిలిన అర్హులైన రైతులకు ఎందుకు నిలిపివేశారు?” అని ఆయన ప్రశ్నించారు. ఎన్నికల సమయంలో అన్ని పంటలకూ రూ. 500 బోనస్ ఇస్తామని చెప్పి, ఇప్పుడు మాట తప్పడంపై మండిపడ్డారు. పెట్టుబడి సాయం కింద అందించాల్సిన రైతు భరోసా నిధుల విడుదలలో ప్రభుత్వం ఘోరంగా వైఫల్యం చెందిందని ధ్వజమెత్తారు. ఇప్పటికే రెండు సార్లు రైతు భరోసా నిధులను ఎగ్గొట్టిన సర్కార్.. యాసంగి సీజన్ ముగుస్తున్నా నేటికీ రైతుల ఖాతాల్లో పూర్తిస్థాయిలో నిధులు జమ చేయకపోవడం దారుణమన్నారు. పంటల సాగు సమయానికే రైతు భరోసా, బోనస్ నిధులను విడుదల చేయాలని డిమాండ్ చేశారు.
మిల్లర్ల దోపిడీపై ఆవేదన
గతంలో పాల ఉత్పత్తిదారులకు అందించిన లీటరుకు రూ. 4 రాయితీని ప్రస్తుత ప్రభుత్వం ఎందుకు నిలిపివేసిందో సమాధానం చెప్పాలన్నారు. కొనుగోలు కేంద్రాల్లో అధికారుల పర్యవేక్షణ లోపించడం వల్ల మిల్లర్లు, కింది స్థాయి సిబ్బంది కుమ్మక్కై తేమ, తాలు పేరుతో క్వింటాలుకు 7 నుండి 8 కిలోల వరకు కోత విధిస్తూ రైతులను నిలువునా దోచుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కేంద్రాల్లో ధాన్యం కొనుగోలు చేయకపోవడంతో మనస్తాపానికి గురై రైతులు నిప్పంటించుకోవడం, ఆత్మహత్యాయత్నాలకు పాల్పడటం, ఎండ తీవ్రతకు కేంద్రాల్లోనే కుప్పకూలి మృతి చెందుతుండటం తనను తీవ్రంగా కలచివేసిందని కన్నీటిపర్యంతమయ్యారు.
పార్టీలకతీతంగా కదలిరావాలి..
రైతుల సమస్యలపై రాజీలేని పోరాటమే లక్ష్యంగా, ఇచ్చిన హామీలను సాధించుకునేందుకు ఈ నెల 30న కరీంనగర్లో రైతు ప్రజాసంఘాల జేఏసీ ఆధ్వర్యంలో నిర్వహించే ‘రైతుల మహాగర్జన సమరభేరి’ సభను చారిత్రాత్మక విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. రాజకీయాలకతీతంగా రాష్ట్రవ్యాప్తంగా ఉన్న అన్నదాతలు, ప్రజాసంఘాల నాయకులు పెద్ద ఎత్తున తరలిరావాలని కోరారు. ఈ సన్నాహక సమావేశంలో రాష్ట్ర నాయకులు రొంటాల కేశవరెడ్డి, బోయినపల్లి శ్రీనివాస్ రావు, తీగల లక్ష్మణ్, విక్రమ్, రవీందర్, శ్రీనివాస్ లతో పాటు వివిధ జిల్లాల అధ్యక్షులు, కో-ఆర్డినేటర్లు పాల్గొన్నారు.










