బాహు బలంన్యూస్ కరీంనగర్ మే 20: రాష్ట్ర ప్రభుత్వం రైతులకు ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో పూర్తిగా విఫలమైందని రైతు ప్రజాసంఘాల సమాఖ్య (జేఏసీ) జాతీయ అధ్యక్షుడు పోలాడి రామారావు విమర్శించారు. ప్రభుత్వ రైతు వ్యతిరేక విధానాలకు నిరసనగా, అన్నదాతల న్యాయమైన డిమాండ్ల సాధనకై ఈనెల 30న కరీంనగర్లో రెండు లక్షల మందితో పార్టీలకతీతంగా ‘రాష్ట్ర స్థాయి రైతుల మహా గర్జన సమరభేరి’ సభను నిర్వహించ తలపెట్టినట్లు ఆయన ప్రకటించారు. బుధవారం కరీంనగర్ జిల్లాలోని మానకొండూర్, శంకరపట్నం, తిమ్మాపూర్, రూరల్, కొత్తపల్లి మండలాల్లోని ఆయా గ్రామాలలో కౌలు రైతులు, ఉపాధి హామీ వర్కర్లతో కలిసి ఆయన విస్తృత సన్నాహక సమావేశాలు నిర్వహించారు. ఈ సందర్భంగా రవాణా, రైతుల సమీకరణ ఏర్పాట్లపై కో-ఆర్డినేటర్లతో సమీక్షించిన అనంతరం, సమరభేరి గోడపత్రికలు, ఆహ్వాన పత్రాలను ఆవిష్కరించారు.
💥 అసంపూర్ణ రుణమాఫీ.. రైతు భరోసా ఏది?
ఈ సందర్భంగా పోలాడి రామారావు మాట్లాడుతూ.. ప్రభుత్వం తక్షణమే నిర్లక్ష్య వైఖరి వీడి రైతులకు ఇచ్చిన హామీలను అమలు చేయాలని, లేనిపక్షంలో భారీ మూల్యం చెల్లించుకోక తప్పదని హెచ్చరించారు. రూ. 2 లక్షల రుణమాఫీని సగం మందికే వర్తింపజేసి, మిగిలిన అర్హులైన రైతులకు ఎందుకు పూర్తి చేయడం లేదని ప్రశ్నించారు. అన్ని పంటలకు రూ. 500 బోనస్ ఇస్తామని చెప్పి మాట తప్పారని ధ్వజమెత్తారు. పెట్టుబడి సాయం కింద అందించాల్సిన ‘రైతు భరోసా’ నిధుల విడుదలలో ప్రభుత్వం ఘోరంగా వైఫల్యం చెందిందని మండిపడ్డారు. ఇప్పటికే రెండు సార్లు ఈ నిధులను ఎగ్గొట్టిన సర్కార్.. యాసంగి సీజన్ ముగుస్తున్నా నేటికీ రైతుల ఖాతాల్లో పూర్తిగా జమ చేయలేదన్నారు. పంటల సాగు సమయంలోనే రైతు భరోసా, బోనస్ నిధులను విడుదల చేయాలని డిమాండ్ చేశారు. గతంలో పాల ఉత్పత్తిదారులకు ఇచ్చిన లీటరుకు రూ. 4 రాయితీని ఎందుకు నిలిపివేశారని నిలదీశారు. కొనుగోలు కేంద్రాల్లో అధికారుల పర్యవేక్షణ లోపం వల్ల మిల్లర్లు, కిందిస్థాయి సిబ్బంది కుమ్మక్కై.. తేమ, తాలు పేరుతో క్వింటాలుకు 7 నుంచి 8 కిలోల వరకు తరుగు తీస్తూ రైతులను నిలువునా దోచుకుంటున్నారని ఆరోపించారు. ఐలండ్స్లో ధాన్యం కుప్పలపైనే రైతులు మృత్యువాత పడటం, కొనుగోళ్లు జరగక ధాన్యానికి నిప్పంటించడం, ఆత్మహత్యా యత్నాలకు పాల్పడటం వంటి ఘటనలు తనను తీవ్రంగా కలచివేశాయని ఆవేదన వ్యక్తం చేశారు.
📢 మే 30న కరీంనగర్ చలో.. జేఏసీ పిలుపు
రైతుల సమస్యలపై పోరాటమే లక్ష్యంగా, ప్రభుత్వ నిర్లక్ష్యానికి నిరసనగా ఈనెల 30న కరీంనగర్లో నిర్వహించబోయే చారిత్రాత్మక ‘మహా గర్జన సమరభేరి’ సభకు రాష్ట్రవ్యాప్తంగా రైతాంగం పార్టీలకతీతంగా పెద్ద ఎత్తున తరలివచ్చి విజయవంతం చేయాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ సన్నాహక కార్యక్రమాల్లో జేఏసీ నాయకులు బొమ్మెన సమ్మయ్య, ఒడ్నాల బాలింగం, బూస తిరుపతి, బాకారపు వేణు, తాళ్లపల్లి సతీష్, మాడ రాజిరెడ్డి, గోగూరి నర్సింహారెడ్డి, దొంగల రాములు, కరివేద సుధాకర్ రెడ్డి, కలకుంట్ల సత్యనారాయణ రావు, గోపు సత్యనారాయణ రెడ్డి, దావు శ్రీనివాస్ రెడ్డి, దాడి కొమురయ్య, ఉమ్మెంతల శ్యామ్ సుందర్ రెడ్డి, గడ్డి పర్శరాములుతో పాటు వివిధ మండలాల, గ్రామాల రైతులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.











