హామీల అమలులో ప్రభుత్వం విఫలం:.. 30న కరీంనగర్‌లో ‘రైతు మహా గర్జన’ రూ. 2 లక్షల రుణమాఫీ సగం మందికేనా? రైతు ప్రజాసంఘాల జేఏసీ జాతీయ అధ్యక్షుడు పోలాడి రామారావు….

బాహు బలంన్యూస్, హన్మకొండ , మే 18:
రాష్ట్ర ప్రభుత్వం రైతులకు ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో పూర్తిగా విఫలమైందని, దీనికి నిరసనగా ఈనెల 30న కరీంనగర్‌లో రెండు లక్షల మందితో ‘రాష్ట్ర స్థాయి రైతుల మహా గర్జన సమరభేరి’ సభను నిర్వహించనున్నట్లు రైతు ప్రజాసంఘాల సమాఖ్య జాతీయ అధ్యక్షుడు పోలాడి రామారావు ప్రకటించారు. హన్మకొండలో సోమవారం ఉమ్మడి వరంగల్ జిల్లా రైతు ప్రజాసంఘాల నాయకులతో కలిసి ఆయన సన్నాహక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సభకు సంబంధించిన పోస్టర్, ఆహ్వాన పత్రాలను ఆవిష్కరించారు.
రైతు భరోసా ఎగ్గొట్టారు.. బోనస్ ఏది?
సమావేశంలో పోలాడి రామారావు మాట్లాడుతూ.. ప్రభుత్వం అధికారంలోకి వచ్చే ముందు ఇచ్చిన ఏ ఒక్క హామీని సక్రమంగా అమలు చేయడం లేదని ధ్వజమెత్తారు. “రెండు లక్షల రూపాయల రుణమాఫీని కేవలం సగం మందికే పరిమితం చేశారు. అర్హులైన మిగతా రైతులకు ఎందుకు పూర్తి చేయడం లేదు? అన్ని పంటలకు రూ. 500 బోనస్ ఇస్తామని చెప్పి ఇప్పుడు కాలయాపన చేస్తున్నారు” అని ప్రశ్నించారు. పెట్టుబడి సాయం కింద అందించాల్సిన ‘రైతు భరోసా’ నిధుల విడుదలలో ప్రభుత్వం పూర్తిగా వైఫల్యం చెందిందని, ఇప్పటికే రెండు సార్లు నిధులను ఎగ్గొట్టిందని మండిపడ్డారు. యాసంగి సీజన్ ముగుస్తున్నా నేటికీ రైతుల ఖాతాల్లో నిధులు జమ కాలేదని, పంటల సాగు సమయంలోనే ఈ నిధులు విడుదల చేయాలని డిమాండ్ చేశారు. గతంలో పాల ఉత్పత్తిదారులకు ఇచ్చిన లీటరుకు రూ. 4 రాయితీని ఎందుకు నిలిపివేశారని ఆయన నిలదీశారు.
కొనుగోలు కేంద్రాల్లో దోపిడీ.. అన్నదాతల ఆత్మఘోష
రైతుల ధాన్యం కొనుగోళ్లలో అధికారుల పర్యవేక్షణ కరువైందని రామారావు ఆవేదన వ్యక్తం చేశారు. మిల్లర్లు, కింది స్థాయి సిబ్బంది కుమ్మక్కై తేమ, తాలు పేరుతో క్వింటాల్‌కు 6 నుంచి 8 కిలోల వరకు కోత విధిస్తూ రైతులను నిలువునా దోచుకుంటున్నారని ఆరోపించారు. వరంగల్ జిల్లా నెక్కొండ మండలం ఆలంఖాన్‌పేట కొనుగోలు కేంద్రంలో ఆదివారం ధాన్యం ఆరబోస్తూ ఓ రైతు కుప్పకూలి మృతి చెందడం, జనగామ జిల్లా లింగాల ఘనపురంలో ధాన్యం కొనుగోలు చేయడం లేదని మరో రైతు ఆత్మహత్యా యత్నానికి పాల్పడటం తనను తీవ్రంగా కలచివేసిందని పేర్కొన్నారు.
పార్టీలకతీతంగా కదలి రండి!
రైతుల న్యాయమైన డిమాండ్ల సాధనే లక్ష్యంగా, ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరికి నిరసనగా ఈ నెల 30న కరీంనగర్‌లో నిర్వహించే చారిత్రాత్మక సమరభేరి సభను విజయవంతం చేయాలని పోలాడి రామారావు పిలుపునిచ్చారు. రాజకీయాలకతీతంగా రాష్ట్రవ్యాప్తంగా రైతులు, ప్రజాసంఘాలు పెద్ద ఎత్తున తరలిరావాలని కోరారు.
ఈ సమావేశంలో ఓసీ జేఏసీ రాష్ట్ర అధ్యక్షుడు గోపు జైపాల్ రెడ్డి, రైతు సంఘాల రాష్ట్ర సలహాదారు రావుల నర్సింహా రెడ్డి, నాయకులు దాతారు प्रभाకర్ రావు, చాడ జైహింద్ రెడ్డి, నల్లా రాజిరెడ్డి, చకిలం రాజేశ్వర్ రావు తదితరులతో పాటు వివిధ మండలాల ప్రతినిధులు పాల్గొన్నారు.

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

రైతు సంక్షేమంపై పాలకుల నిర్లక్ష్యం…. ‘మహాగర్జన’తో సర్కారును నిలదీస్తాం …ఈ నెల 30న కరీంనగర్‌లో రాష్ట్ర స్థాయి రైతు సమరభేరి డిమాండ్ల సాధనే లక్ష్యంగా పోలాడి రామారావు పిలుపు….. గోడపత్రికల ఆవిష్కరణ…

మరిన్ని వార్తలు చూడండి :

బాహుబలం టివీ

 Don't Miss this News !