హుజురాబాద్/సైదాపూర్ స్వేచ్ఛ:మే 15:
భారతీయ గిరిజన సంస్కృతికి అద్దం పట్టేలా మధ్యప్రదేశ్ రాష్ట్రం మండ్ల జిల్లాలోని బీచియా తాలూకాలో గల పవిత్ర నర్మదా నది తీరాన ‘ఆది ఉత్సవ్’ సంబరాలు అంబరాన్నంటాయి. చారిత్రక రాంనగర్ మోతీ మహల్ ప్రాంగణంలో జరుగుతున్న ఈ ఉత్సవాల్లో భాగంగా శుక్రవారం తెలంగాణ రాష్ట్ర సంస్కృతిని చాటిచెప్పేలా నిర్వహించిన లంబాడీ గిరిజన నృత్య ప్రదర్శన ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.
తెలంగాణ ప్రాభవం – సైదాపూర్ కళాకారుల నృత్యం..
కరీంనగర్ జిల్లా సైదాపూర్ మండలం ఎలాబోతారం గ్రామానికి చెందిన నమిండ్ల మధు నేతృత్వంలోని కళాకారుల బృందం ఈ వేదికపై తమ ప్రతిభను చాటుకుంది. గిరిజన సంప్రదాయ దుస్తులు ధరించి, లయబద్ధమైన అడుగులతో వారు చేసిన లంబాడీ నృత్యం ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేసింది. తెలంగాణ మట్టి వాసనను, గిరిజన జీవన వైవిధ్యాన్ని ప్రతిబింబించేలా సాగిన ఈ ప్రదర్శనకు సభికుల నుండి విశేష స్పందన లభించింది.
దేశవ్యాప్త కళాకారుల సంగమం
భారతదేశంలోని అన్ని రాష్ట్రాల నుంచి వచ్చిన గిరిజన కళాకారులు ఈ ఉత్సవంలో పాల్గొని తమ తమ సంప్రదాయ నృత్యాలను ప్రదర్శించారు. దేశం నలుమూలల నుండి వచ్చిన ఈ కళాకారుల ప్రదర్శనలు భారతీయ గిరిజన సంస్కృతి యొక్క ఐక్యతను చాటిచెప్పాయి.
ముఖ్య అతిథుల అభినందనలు
ఈ కార్యక్రమానికి కేంద్ర గిరిజన వ్యవహారాల శాఖ మంత్రి, మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి సహా పలువురు కేంద్ర, రాష్ట్ర మంత్రులు హాజరయ్యారు. కళాకారుల ప్రదర్శనలను తిలకించిన అతిథులు వారిని ప్రత్యేకంగా అభినందించారు. గిరిజన కళలను కాపాడుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉందని, ఇలాంటి వేదికలు కళాకారులకు గొప్ప ప్రోత్సాహాన్నిస్తాయని వారు పేర్కొన్నారు.
తెలంగాణ గడ్డపై నుంచి వెళ్లిన ఎలాబోతారం కళాకారులు జాతీయ స్థాయిలో తమ ప్రతిభను చాటి రాష్టానికి పేరు తీసుకురావడం పట్ల పలువురు హర్షం వ్యక్తం చేస్తున్నారు.










