బాహు బలంన్యూస్ హుజురాబాద్, ఏప్రిల్ 07:
“కమిషన్ల కక్కుర్తి కోసం ప్రజల ప్రాణాలను పణంగా పెడతారా? పచ్చని పొలాల మధ్య విషం చిమ్మే డంపింగ్ యార్డును నిర్మిస్తే సహించేది లేదు. తక్షణమే ఈ ప్రాజెక్టును రద్దు చేయకపోతే తెలంగాణ ఉద్యమ తరహాలో మరో పోరాటాన్ని చూస్తారు” అని రైతు ప్రజాసంఘాల సమాఖ్య జాతీయ అధ్యక్షుడు పోలాడి రామారావు ప్రభుత్వాన్ని ఘాటుగా హెచ్చరించారు.
హుజురాబాద్కు సమీపంలోని సిర్సపల్లి గ్రామ సరిహద్దులో, హైవే పక్కన నిర్మించ తలపెట్టిన ‘వేస్ట్ టు ఎనర్జీ’ ప్రాజెక్టును నిరసిస్తూ స్థానిక ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి చేపట్టిన 24 గంటల నిరాహార దీక్షకు రామారావు సంఘీభావం ప్రకటించారు. రైతు ప్రజాసంఘాల జేఏసీ నాయకులతో కలిసి దీక్షా శిబిరాన్ని సందర్శించిన ఆయన, ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలపై మండిపడ్డారు.
నిబంధనలు తుంగలో తొక్కి ‘రాంకీ’కి కట్టబెడతారా?
ఉమ్మడి కరీంనగర్, వరంగల్ జిల్లాల చెత్తను తరలించేందుకు హుజురాబాద్ను అడ్డాగా మార్చడం వెనుక భారీ కుంభకోణం దాగి ఉందని పోలాడి రామారావు ధ్వజమెత్తారు. ఎలాంటి నిబంధనలు పాటించకుండా, కనీసం ప్రజాభిప్రాయ సేకరణ కూడా చేయకుండా ‘రాంకీ’ సంస్థకు DBFOT (డిజైన్, బిల్డ్, ఫైనాన్స్, ఆపరేట్, ట్రాన్స్ఫర్) పద్ధతిలో ఈ ప్రాజెక్టును అప్పగించడం వెనుక అధికార పార్టీ ప్రతినిధుల హస్తం ఉందని ఆరోపించారు.
“జవహర్ నగర్ పరిస్థితిని ఒకసారి చూడండి. అక్కడ రాంకీ సంస్థ నిర్మించిన డంపింగ్ యార్డ్ వల్ల వేలాది మంది అనారోగ్యం బారిన పడ్డారు. శ్వాసకోస సమస్యలు, వినికిడి లోపాలతో ప్రజలు జీవచ్ఛవాల్లా మారుతుంటే.. ఇప్పుడు అదే మృత్యుకూపాన్ని హుజురాబాద్కు తీసుకురావడం ఎంతవరకు న్యాయం?” అని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.
ప్రభుత్వం స్పందించకుంటే పాలనను స్తంభింపజేస్తాం
వేలాది మంది మహిళలు, రైతులు రోడ్లపైకి వచ్చి నిరసన తెలుపుతున్నా ప్రభుత్వంలో చలనం లేకపోవడం దురదృష్టకరమని రామారావు అన్నారు. ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి పిలుపుతో కదిలివచ్చిన జనసందోహం రెండో తెలంగాణ ఉద్యమాన్ని తలపిస్తోందని పేర్కొన్నారు. ప్రైవేట్ సంస్థల లాభాల కోసం కాకుండా, జపాన్ వంటి దేశాల్లో ఉన్నట్లుగా అత్యాధునిక సాంకేతికతతో, జనావాసాలకు దూరంగా కాలుష్య రహిత ప్రాజెక్టులను ప్రభుత్వమే చేపట్టాలని ఆయన డిమాండ్ చేశారు.
ప్రాణాలైనా ఇస్తాం.. ప్రాజెక్టును అడ్డుకుంటాం: ఎడవెల్లి కొండాల రెడ్డి..
ఈ కార్యక్రమంలో పాల్గొన్న రైతు నాయకులు ఎడవెల్లి కొండాల రెడ్డి మాట్లాడుతూ.. డంపింగ్ యార్డు నిర్మాణాన్ని అడ్డుకోవడానికి తమ ప్రాణాలను సైతం లెక్కచేయబోమని స్పష్టం చేశారు. ప్రభుత్వం కాలయాపన చేస్తే మూల్యం చెల్లించుకోక తప్పదని, రాబోయే రోజుల్లో ఉద్యమాన్ని మరింత ఉధృతం చేసి ప్రభుత్వాన్ని స్తంభింపజేస్తామని హెచ్చరించారు.











