బాహు బలంన్యూస్ హుజూరాబాద్, ఏప్రిల్ 06: అధికార పీఠం ఎక్కేముందు అన్నదాతలకు అడ్డగోలు హామీలిచ్చి, గద్దెనెక్కిన తర్వాత రైతుల సంక్షేమాన్ని గాలికొదిలేసిన ప్రభుత్వ తీరుపై రైతు లోకం కన్నెర్ర చేస్తోంది. ‘రైతు ప్రభుత్వం’ అని డప్పు కొట్టుకునే పాలకులు.. క్షేత్రస్థాయిలో రైతులను నట్టేట ముంచుతున్నారని రైతు ప్రజాసంఘాల సమాఖ్య జాతీయ అధ్యక్షుడు పోలాడి రామారావు నిప్పులు చెరిగారు. పాలకుల మొండివైఖరిని ఎండగట్టేందుకు, మొద్దునిద్ర పోతున్న ప్రభుత్వాన్ని మేల్కొలిపేందుకు ఈ నెల 28న కరీంనగర్ వేదికగా ‘రాష్ట్ర స్థాయి రైతు మహా గర్జన సమర భేరి’ నిర్వహిస్తున్నట్లు ఆయన ప్రకటించారు. సోమవారం హుజూరాబాద్లో ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డిని కలిసి ఆహ్వాన పత్రం అందజేశారు.
హామీలు గాలికి.. రైతుల బతుకులు ఆగమాగం!
ప్రభుత్వ వైఫల్యాలను ఏకిపారేస్తూ పోలాడి రామారావు సంధించిన విమర్శనాస్త్రాలు ఇవే:
రుణమాఫీ నాటకం: రూ. 2 లక్షల రుణమాఫీ చేస్తామని ప్రగల్భాలు పలికిన సర్కార్.. నేటికీ 70 శాతం మంది అర్హులైన రైతులకు మొండిచేయి చూపడం దారుణమని మండిపడ్డారు. ఇది రుణమాఫీయా లేక రైతులను వంచించే కుట్రనా అని ప్రశ్నించారు.
రైతు భరోసాకు తిలోదకాలు: రైతు భరోసా నిధులను రెండు విడతలుగా ఎగ్గొట్టి అన్నదాతల నోరు కొట్టారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అన్ని పంటలకు రూ. 500 బోనస్ ఇస్తామన్న మాట ఏమైందని, కేవలం కొన్ని పంటలకే పరిమితం చేసి రైతుల మధ్య చిచ్చు పెడుతున్నారని ధ్వజమెత్తారు.
యువత, విద్యార్థులపై దగా: నిరుద్యోగులకు ‘జాబ్ క్యాలెండర్’ లేదని, విద్యార్థులకు ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు చెల్లించకుండా వారి భవిష్యత్తుతో చెలగాటమాడుతున్నారని విమర్శించారు.
పెన్షన్లు లేవు.. రాయితీలు దేవుడెరుగు!
“50 ఏళ్లు నిండిన రైతులకు రూ. 6,000 పెన్షన్ ఇస్తామన్న హామీ ఎటు పోయింది? పాల ఉత్పత్తిదారులకు ఇచ్చే లీటరుకు రూ. 4 రాయితీని నిలిపివేసి వారి పొట్టకొట్టడం న్యాయమేనా?” అని ప్రశ్నించారు. ఓసీ కార్పొరేషన్లను నామమాత్రంగా ప్రకటించి, వాటికి పాలకమండళ్లు లేకుండా, నిధులు కేటాయించకుండా కేవలం కాలక్షేపం చేస్తున్నారని ఎద్దేవా చేశారు. ప్రైవేట్ సీడ్ కంపెనీల ఆగడాలకు అడ్డుకట్ట వేయకుండా, ప్రకృతి వైపరీత్యాలతో నష్టపోయిన పంటలను కొనుగోలు చేయకుండా ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని దుయ్యబట్టారు.
అశ్విక దళంలా తరలివస్తున్న అన్నదాతలు .
ఈ నెల 28న కరీంనగర్ పట్టణం జనసంద్రం కాబోతోందని రామారావు ధీమా వ్యక్తం చేశారు.
భారీ జనసమీకరణ: ఉమ్మడి కరీంనగర్ జిల్లా నుంచే 50 వేల మంది, రాష్ట్రవ్యాప్తంగా దాదాపు 2 లక్షల మంది రైతులు, మహిళలు, యువత స్వచ్ఛందంగా తరలివస్తున్నారు.
యుద్ధ ప్రాతిపదికన ఏర్పాట్లు: హుజూరాబాద్, మానకొండూర్, చొప్పదండి, హుస్నాబాద్ ప్రాంతాల నుంచి 800 ట్రాక్టర్లు, 1500 బస్సులు, వేల సంఖ్యలో వాహనాల్లో రైతులు తరలిరానున్నారు.
మహిళా శక్తి: ఈ సభలో 30 వేల మంది మహిళా రైతులు పాల్గొని పాలకుల నిర్లక్ష్యంపై గళమెత్తనున్నారు.
ఈ మహా గర్జన పార్టీల తీతలకు అతీతంగా, రైతుల ఆత్మగౌరవ పోరాటంగా సాగుతుందని, ప్రభుత్వం ఇప్పటికైనా కళ్లు తెరిచి హామీలను అమలు చేయకపోతే గద్దె దించడం ఖాయమని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో పోరెడ్డి శంతన్ రెడ్డి, ఎడవెల్లి కొండాల్ రెడ్డి, ఇరుముళ్ళ సురేందర్ రెడ్డి సహా పలువురు ప్రజాప్రతినిధులు, రైతు సంఘాల నేతలు పాల్గొన్నారు.









