బాహు బలంన్యూస్ హుజూరాబాద్ ఏప్రిల్ 04 :రాష్ట్రంలోని అన్నదాతలు, విద్యార్థులు మరియు వివిధ సామాజిక వర్గాలకు ఇచ్చిన హామీలను అమలు చేయడంలో కాంగ్రెస్ ప్రభుత్వం అవలంబిస్తున్న నిర్లక్ష్య వైఖరిని తక్షణమే విడనాడాలని రైతు ప్రజాసంఘాల సమాఖ్య జాతీయ అధ్యక్షుడు పోలాడి రామారావు డిమాండ్ చేశారు. కరీంనగర్లో ఈ నెల 28న నిర్వహించ తలపెట్టిన ‘రాష్ట్ర స్థాయి రైతుల మహాగర్జన – సమరభేరి’ బహిరంగ సభకు హాజరు కావాలని కోరుతూ కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్కు ఆయన శనివారం ఆహ్వాన పత్రం అందజేశారు. హుజూరాబాద్లో డంపింగ్ యార్డు పరిశీలనకు వచ్చిన మంత్రిని ప్రజాసంఘాల నాయకులతో కలిసి కలిసిన రామారావు, సభ ఉద్దేశ్యాన్ని వివరించారు. దీనిపై సానుకూలంగా స్పందించిన బండి సంజయ్.. రైతుల పోరాటానికి తన సంపూర్ణ మద్దతు, సహకారం ఉంటాయని ప్రకటించారు.
అసంపూర్తి రుణమాఫీ.. అందని భరోసా
అనంతరం పోలాడి రామారావు మాట్లాడుతూ.. రైతు ప్రభుత్వం అని చెప్పుకునే రేవంత్ రెడ్డి సర్కారు వ్యవసాయ రంగాన్ని విస్మరిస్తోందని విమర్శించారు. బడ్జెట్లో సాగు రంగానికి నిధులు తగ్గించడమే కాకుండా, రెండు లక్షల రుణమాఫీని 70 శాతం మందికి ఇంకా పూర్తి చేయలేదని ఆరోపించారు. కౌలు రైతులకు ఇచ్చిన హామీలు అటకెక్కాయని, అన్ని రకాల పంటలకు క్వింటాకు రూ.500 బోనస్ ఇస్తామని చెప్పి, కేవలం సన్న రకాలకే పరిమితం చేస్తూ రైతులను మోసం చేస్తున్నారని మండిపడ్డారు. ఇప్పటికే రెండు సార్లు ‘రైతు భరోసా’ నిధులను ఎగ్గొట్టి, అన్నదాతలను ప్రభుత్వం యాచకులుగా మారుస్తోందని ధ్వజమెత్తారు. విద్యార్థుల ఫీజు రీయింబర్స్మెంట్ నిధులు విడుదల చేయకపోవడం, ఓసీ/రెడ్డి కార్పొరేషన్లకు పాలక మండళ్లు ఏర్పాటు చేయకుండా నామమాత్రంగా ఉంచడంపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.
ప్రధాన డిమాండ్లు ఇవే..
రైతులకు న్యాయం చేకూర్చడానికి పలు కీలక డిమాండ్లను రామారావు ప్రభుత్వం ముందుంచారు:
50 ఏళ్లు నిండిన ప్రతి రైతుకు నెలకు రూ.6 వేల పెన్షన్ కల్పించాలి.
ఉపాధి హామీ పథకాన్ని వ్యవసాయ రంగానికి అనుసంధానం చేయాలి.
రైతు బీమా వయోపరిమితిని 59 నుంచి 70 ఏళ్లకు పెంచాలి.
రైతులకు రూ.20 లక్షల ఉచిత వైద్య సౌకర్యం కోసం హెల్త్ కార్డులు మంజూరు చేయాలి.
పాల ఉత్పత్తిదారులకు లీటరుకు రూ.4 రాయితీ పునరుద్ధరించాలి.
సీడ్ కంపెనీల ఆగడాలను అరికట్టి, గిట్టుబాటు ధరపై ప్రత్యేక రైతు చట్టం తేవాలి.
లక్షలాది మందితో కరీంనగర్ లో సమరభేరి
ఈ నెల 28న జరిగే సభకు రాజకీయాలకు అతీతంగా భారీ ఏర్పాట్లు చేస్తున్నట్లు రామారావు తెలిపారు. ఈ సభకు ఇప్పటికే మాజీ మంత్రులు ఈటల రాజేందర్, హరీశ్ రావు, గంగుల కమలాకర్, శ్రీనివాస్ గౌడ్, జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత, సీపీఐ నేత చాడ వెంకట్ రెడ్డి తదితరులను ఆహ్వానించామని, వారు సానుకూలంగా స్పందించారని పేర్కొన్నారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లా నుంచే 50 వేల మందితో పాటు, రాష్ట్రవ్యాప్తంగా సుమారు 2 లక్షల మంది ఈ సభకు తరలిరానున్నారని వెల్లడించారు. వెయ్యి ట్రాక్టర్లు, రెండు వేల బస్సులతో ప్రజలు స్వచ్ఛందంగా తరలివచ్చేలా ప్రచార సామగ్రిని ఇప్పటికే సిద్ధం చేశామన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర, జిల్లా స్థాయి నాయకులు ఎడవెల్లి కొండాల్ రెడ్డి, శ్రీనివాస్, పోల్సాని రామారావు, యాదగిరి, కృష్ణా రెడ్డి తదితరులు పాల్గొన్నారు










