బాహు బలంన్యూస్ జగిత్యాల, ఏప్రిల్ 05:
రాష్ట్ర ప్రభుత్వం రైతాంగాన్ని, విద్యార్థులను మరియు వివిధ సామాజిక వర్గాలను హామీల పేరుతో వంచిస్తోందని రైతు ప్రజాసంఘాల సమాఖ్య జాతీయ అధ్యక్షుడు పోలాడి రామారావు నిప్పులు చెరిగారు. సర్కార్ నిర్లక్ష్య వైఖరిని ఎండగడుతూ, అన్నదాతల డిమాండ్ల సాధనే లక్ష్యంగా ఈనెల 28న కరీంనగర్లో ‘రైతు మహా గర్జన సమరభేరి’ నిర్వహించనున్నట్లు ప్రకటించారు. 2 లక్షల మంది రైతులతో నిర్వహించే ఈ సభ రాష్ట్ర రాజకీయాల్లో ప్రకంపనలు సృష్టించడం ఖాయమని ఆయన ధీమా వ్యక్తం చేశారు.
ఆదివారం జగిత్యాలలో ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్, మాజీ మంత్రి జీవన్ రెడ్డిలను పోలాడి రామారావు బృందం కలిసింది. ఈ సందర్భంగా సభకు సంబంధించిన వాల్ పోస్టర్లను నాయకులు ఆవిష్కరించారు.
జీవన్ రెడ్డి మద్దతు: పార్టీలకతీతంగా కదలిరండి!
ఈ సందర్భంగా మాజీ మంత్రి జీవన్ రెడ్డి మాట్లాడుతూ.. “రైతుల సమస్యల పరిష్కారం కోసం ఈ పోరాటం అత్యవసరం. కరీంనగర్ సభకు నా సంపూర్ణ మద్దతు ఉంటుంది, నేనే స్వయంగా హాజరవుతాను. రైతులకు ఇచ్చిన ప్రతి హామీని నెరవేర్చాల్సిన బాధ్యత పాలక పక్షాలపై ఉంది” అని స్పష్టం చేశారు. అందరూ పార్టీలకతీతంగా ఈ సభలో పాల్గొని విజయవంతం చేయాలని ఆయన పిలుపునిచ్చారు.
ప్రభుత్వానికి చురకలు అంటించిన పోలాడి రామారావు:
పొలాడి రామారావు మాట్లాడుతూ రాష్ట్ర పాలనపై విమర్శల వర్షం కురిపించారు:
రుణమాఫీ మోసం: రాష్ట్రంలో ఇంకా 70 శాతం మంది రైతులకు రెండు లక్షల రుణమాఫీ కాలేదు. ఇది ముమ్మాటికీ రైతును మోసం చేయడమే.
బోనస్ బోగస్: అన్ని పంటలకు రూ. 500 బోనస్ ఇస్తామని చెప్పి, ఇప్పుడు కేవలం సన్న రకాలకే అది కూడా అరకొరగా ఇస్తూ కాలయాపన చేస్తున్నారు.
రైతు భరోసా ఎగ్గొట్టారు: ఇప్పటికే రెండు సార్లు రైతు భరోసా నిధులు ఎగ్గొట్టిన ప్రభుత్వానికి రైతుల ఉసురు తగలక తప్పదు.
పెన్షన్ & భీమా: 50 ఏళ్లు నిండిన ప్రతి రైతుకు రూ. 6 వేల పెన్షన్ ఇవ్వాలి. రైతు భీమా వయోపరిమితిని 70 ఏళ్లకు పెంచాలి.
వైద్యం & ఉపాధి: రైతులకు రూ. 20 లక్షల ఉచిత వైద్య సౌకర్యం కల్పించే హెల్త్ కార్డులు ఇవ్వాలి. ఉపాధి హామీ పథకాన్ని వ్యవసాయానికి అనుసంధానం చేయాలి.
సమరభేరి డిమాండ్లు ఇవే:
విద్యార్థుల ఫీజు రీయింబర్స్ మెంట్ నిధులు వెంటనే విడుదల చేయాలని, కౌలు రైతులకు ఇచ్చిన హామీలను నెరవేర్చాలని, పంట సాగు సమయంలోనే పెట్టుబడి సాయం అందించాలని రామారావు డిమాండ్ చేశారు. రైతులే గిట్టుబాటు ధర నిర్ణయించుకునేలా కొత్త రైతు చట్టాన్ని తీసుకురావాలని సూచించారు.
ఈ కార్యక్రమంలో జేఏసీ నాయకులు కొండాల్ రెడ్డి, వెంకట్ రెడ్డి, సత్యనారాయణ, వెంకటేశ్వర్ రావుతో పాటు సర్పంచులు రాజగంగు, అంజయ్య, చంద్ర శేఖర్, బండారు సాయిరాజ్, బానోతు రమేష్, వనిత, గుగ్లోతు తిరుపతి, మాలొతు తిరుపతి తదితరులు పాల్గొని సమరభేరిని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.









