బాహు బలంన్యూస్ హైదరాబాద్ ఏప్రిల్ 03: తెలంగాణ అన్నదాతల సమస్యల పరిష్కారమే ధ్యేయంగా, ప్రభుత్వం ఇచ్చిన హామీలను నెరవేర్చాలని డిమాండ్ చేస్తూ ఈనెల 28న కరీంనగర్ వేదికగా లక్షలాది మందితో ‘రైతుల మహాగర్జన – సమరభేరి’ నిర్వహించనున్నట్లు రైతు ప్రజాసంఘాల జాతీయ అధ్యక్షుడు పోలాడి రామారావు, రాష్ట్ర అధ్యక్షుడు గూడూరి స్వామి రెడ్డి వెల్లడించారు. ఈ మేరకు శుక్రవారం హైదరాబాద్లో పలువురు మాజీ మంత్రులు, ప్రజాప్రతినిధులతో కలిసి సభకు సంబంధించిన గోడప్రతులను ఆవిష్కరించారు.
రాజకీయాలకు అతీతంగా ఏకమవుతున్న అన్నదాతలు
రాష్ట్రంలోని కౌలు రైతులు, పాల ఉత్పత్తిదారులు మరియు సాధారణ రైతాంగాన్ని పీడిస్తున్న సమస్యలపై పోరాటాన్ని ఉధృతం చేయాలని రైతు జేఏసీ నిర్ణయించింది. ఈ మహాసభకు మద్దతు కోరుతూ పోలాడి రామారావు బృందం మాజీ మంత్రులు తన్నీరు హరీష్ రావు, వీ. శ్రీనివాస్ గౌడ్, సుద్దాల దేవయ్య, రావుల చంద్రశేఖర్ రెడ్డిలను కలిసి ఆహ్వాన పత్రికలను అందజేసింది. దీనికి స్పందించిన మాజీ మంత్రులు, రైతుల పక్షాన నిలిచే ఈ సభకు తమ సంపూర్ణ సహకారం ఉంటుందని, స్వయంగా సభకు హాజరవుతామని భరోసా ఇచ్చారు.
ప్రభుత్వాల నిర్లక్ష్యంపై నిప్పులు
పాలకులు కేవలం మాటలకే పరిమితమవుతున్నారని, క్షేత్రస్థాయిలో రైతు పరిస్థితి దారుణంగా ఉందని నాయకులు ఆవేదన వ్యక్తం చేశారు. ముఖ్యంగా ఈ క్రింది డిమాండ్ల సాధనకై యుద్ధం ప్రకటించారు:
రుణమాఫీ: కేవలం 30 శాతం మందికే రుణమాఫీ కావడం అన్యాయమని, మిగిలిన 70 శాతం మందికి వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేశారు.
రైతు భరోసా: సాగు సమయం దాటిపోతున్నా రైతు భరోసా నిధులు అందకపోవడంపై మండిపడ్డారు.
బోనస్: సన్న రకాలతో పాటు అన్ని రకాల పంటలకు క్వింటాల్కు రూ. 500 బోనస్ తక్షణమే చెల్లించాలి.
పాల రైతుల సమస్యలు: గతంలో ఇచ్చిన లీటరుకు రూ. 4 రాయితీని ప్రస్తుత ప్రభుత్వం నిలిపివేయడాన్ని తప్పుబట్టారు.
పోరుబాటలో భాగస్వాములు కావాలి..
మొత్తం 12 ప్రధాన డిమాండ్లతో నిర్వహించే ఈ సమరభేరిలో ఉమ్మడి మెదక్, మహబూబ్ నగర్, రంగారెడ్డి జిల్లాల నుంచి భారీగా రైతులు తరలిరావాలని జేఏసీ పిలుపునిచ్చింది. ఈ కార్యక్రమంలో రైతు సంఘాల నాయకులు నదిపెల్లి వెంకటేశ్వర్ రావు, హంస కేతన్ రెడ్డి, చకిలం రమణయ్య, వన్నాల విష్ణు వర్ధన్ రెడ్డి, నరేష్ యాదవ్, మంద గల్ల నగేష్, కవ్వంపల్లి అనిల్, మహేందర్ రెడ్డి తదితరులు పాల్గొని తమ సంఘీభావాన్ని ప్రకటించారు.









