బాహు బలంన్యూస్ హైదరాబాద్ ఏప్రిల్ 03 : అన్నదాతలకు ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని, పాలకుల కళ్ళు తెరిపించేందుకు ఈనెల 28వ తేదీన కరీంనగర్ వేదికగా 2 లక్షల మందితో ‘రాష్ట్ర స్థాయి రైతు మహాగర్జన సమరభేరి’ సభను నిర్వహిస్తున్నట్లు రైతు ప్రజాసంఘాల జాతీయ అధ్యక్షుడు పోలాడి రామారావు, రాష్ట్ర అధ్యక్షుడు గూడూరి స్వామి రెడ్డి ప్రకటించారు.
శుక్రవారం హైదరాబాద్లో ఉమ్మడి మహబూబ్ నగర్, మెదక్, రంగారెడ్డి జిల్లాల నాయకులతో కలిసి వారు మాజీ మంత్రులు తన్నీరు హరీష్ రావు, వి. శ్రీనివాస్ గౌడ్, సుద్దాల దేవయ్య, రావుల చంద్రశేఖర్ రెడ్డి, మాజీ కార్పొరేషన్ చైర్మన్ ఎర్రోళ్ల శ్రీనివాస్ మరియు ఇతర మాజీ ప్రజాప్రతినిధులను కలిశారు. ఈ సందర్భంగా సభకు సంబంధించిన ఆహ్వాన పత్రికలను వారికి అందజేసి, సభ గోడప్రతులను ఆవిష్కరించారు. ఈ పోరాటానికి తమ సంపూర్ణ మద్దతు ఉంటుందని, తాము స్వయంగా సభకు హాజరవుతామని మాజీ మంత్రులు ఈ సందర్భంగా స్పష్టం చేశారు.
రైతులకు మొండిచేయి.. 12 డిమాండ్లతో పోరుబాట.
ఈ సందర్భంగా పోలాడి రామారావు మాట్లాడుతూ.. ప్రభుత్వం అధికారంలోకి వచ్చేముందు రైతులకు ఇచ్చిన హామీలను తుంగలో తొక్కిందని మండిపడ్డారు. ముఖ్యంగా కౌలు రైతులకు ఇచ్చిన ఏ ఒక్క వాగ్దానాన్ని అమలు చేయలేదని ఆరోపించారు. రూ. 2 లక్షల రుణమాఫీ ప్రక్రియలో కేవలం 30 శాతం మందికే లబ్ధి చేకూరిందని, మిగిలిన 70 శాతం మంది రైతులు నేటికీ బ్యాంకుల చుట్టూ తిరుగుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
ప్రధాన డిమాండ్లు ఇవే.
రుణమాఫీ: మిగిలిపోయిన 70 శాతం మంది రైతులకు తక్షణమే ఏకకాలంలో రుణమాఫీ పూర్తి చేయాలి.
రైతు భరోసా: సాగు సీజన్ ముగిసిపోతున్నా పెట్టుబడి సాయం అందలేదు, వెంటనే రైతు భరోసా నిధులను విడుదల చేయాలి.
బోనస్: కేవలం సన్న రకాలకే కాకుండా, అన్ని రకాల పంటలకు క్వింటాల్కు రూ. 500 బోనస్ చెల్లించాలి.
పాల రైతులకు ఊరట: గత ప్రభుత్వం ఇచ్చిన లీటరుకు రూ. 4 రాయితీని పునరుద్ధరించాలి.
కౌలు రైతులు: కౌలు రైతులకు గుర్తింపు కార్డులు ఇచ్చి, ప్రభుత్వ పథకాలు వారికి వర్తింపజేయాలి.
రాజకీయాలకు అతీతంగా సంఘటితం.
ఈ సమరభేరి సభను ఎటువంటి రాజకీయ రంగు లేకుండా, కేవలం రైతుల ప్రయోజనాలే ధ్యేయంగా నిర్వహిస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు. పాలకుల నిర్లక్ష్య ధోరణి వల్ల అన్నదాతలు ఆత్మహత్యల వైపు వెళ్లకుండా, వారిలో ధైర్యాన్ని నింపడమే ఈ మహాసభ ముఖ్య ఉద్దేశమని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో రైతు ప్రజాసంఘాల నాయకులు నదిపెల్లి వెంకటేశ్వర్ రావు, హంస కేతన్ రెడ్డి, చకిలం రమణయ్య, వన్నాల విష్ణు వర్ధన్ రెడ్డి, నరేష్ యాదవ్, మంద గల్ల నగేష్, కవ్వంపల్లి అనిల్, మహేందర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.









