బాహు బలంన్యూస్ వరంగల్/హన్మకొండ మార్చి 19 :
అన్నదాతలను ఆదుకోవడంలో ప్రభుత్వాల నిర్లక్ష్యానికి నిరసనగా, రైతు సమస్యల పరిష్కారం కోసం ఏప్రిల్ 28న కరీంనగర్ వేదికగా ‘రైతు మహాగర్జన – సమరభేరి’ సభను అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహించనున్నట్లు రైతు ప్రజాసంఘాల సమాఖ్య జాతీయ అధ్యక్షుడు పోలాడి రామారావు ప్రకటించారు. ఈ మహాసభ విజయవంతం కావాలని ఆకాంక్షిస్తూ ఉగాది పర్వదినం సందర్భంగా గురువారం వరంగల్ వేయి స్థంభాల గుడిలో ఓసీ ఐకాస, రైతు సంఘాల నేతలతో కలిసి ఆయన ప్రత్యేక రుద్రాభిషేకం, అన్నదానం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో వరంగల్ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి పాల్గొని రైతులకు శుభాకాంక్షలు తెలిపారు.
ప్రభుత్వాల తీరుపై ధ్వజం:
ఈ సందర్భంగా పోలాడి రామారావు మాట్లాడుతూ.. పాలకులు తాము ‘రైతు ప్రభుత్వాలమని’ గొప్పలు చెప్పుకోవడం తప్ప, క్షేత్రస్థాయిలో రైతులకు ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో పూర్తిగా విఫలమయ్యారని విమర్శించారు. ముఖ్యంగా కౌలు రైతుల సమస్యలను గాలికి వదిలేశారని, ‘రైతు భరోసా’ నిధుల విడుదలలో జాప్యం చేయడం వల్ల సాగు సమయంలో రైతులు అప్పుల పాలవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
ప్రధాన డిమాండ్లు ఇవే:
మద్దతు ధర: క్వింటాల్ వడ్లకు రూ. 3,000 చెల్లించాలి. సన్న, దొడ్డు వడ్లకు హామీ ఇచ్చిన విధంగా రూ. 500 బోనస్ వెంటనే అందించాలి.
ఉపాధి హామీ అనుసంధానం: పెరుగుతున్న కూలీల ఖర్చుల దృష్ట్యా, జాతీయ ఉపాధి హామీ పథకాన్ని తక్షణమే వ్యవసాయ రంగానికి అనుసంధానం చేయాలి.
పెన్షన్ & భీమా: 50 ఏళ్లు నిండిన రైతులకు నెలకు రూ. 6,000 పెన్షన్ ఇవ్వాలి. రైతు భీమా వయోపరిమితిని 70 ఏళ్లకు పెంచాలి.
ఉచిత వైద్యం: రైతు కుటుంబాల ఆరోగ్య సమస్యల కోసం రూ. 20 లక్షల వరకు ఉచిత వైద్య సదుపాయం కల్పించాలి.
ఓసీ కార్పొరేషన్లు: ఆర్థికంగా వెనుకబడిన అగ్రకుల పేదల కోసం జాతీయ స్థాయి ఓసీ కమిషన్ ఏర్పాటు చేయాలి. నామమాత్రంగా ఉన్న ఓసీ కార్పొరేషన్లకు తక్షణమే నిధులు విడుదల చేసి, పాలకమండళ్లను నియమించాలి.
శరవేగంగా ఏర్పాట్లు:
కరీంనగర్ సభకు ఉత్తర తెలంగాణ జిల్లాల ఓసీ జేఏసీ చైర్మన్ పెండ్యాల రాంరెడ్డి అధ్యక్షత వహిస్తారని రామారావు తెలిపారు. ఈ సభకు రాష్ట్రవ్యాప్తంగా లక్షలాదిగా రైతులు తరలిరానున్నారని, కేవలం వరంగల్, కరీంనగర్ జిల్లాల నుంచే 30 వేల మంది మహిళలను సమీకరిస్తున్నట్లు వెల్లడించారు. రాజకీయాలకతీతంగా రైతులందరూ ఈ పోరాటంలో భాగస్వాములు కావాలని ఆయన పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో ఓసీ జేఏసీ రాష్ట్ర గౌరవ అధ్యక్షులు గంగు ఉపేంద్ర శర్మ, వైశ్య సంఘాల జేఏసీ చైర్మన్ అయిత నాగరాజు, రైతు ప్రజాసంఘాల రాష్ట్ర కన్వీనర్ కూర తోట సురేందర్ రెడ్డి, ప్రధాన కార్యదర్శి చందుపట్ల నరసింహ రెడ్డి మరియు వివిధ జిల్లాల నాయకులు పాల్గొన్నారు.













