బాహు బలంన్యూస్ హుజురాబాద్, మార్చి 14:
“ప్రజా సంక్షేమమే లక్ష్యమని చెప్పుకునే పాలకులకు, దేశానికి వెన్నెముక అయిన రైతన్న కనిపిండటం లేదా? ఇచ్చిన హామీలను తుంగలో తొక్కి అన్నదాతలను విస్మరిస్తే ప్రభుత్వానికి పతనం తప్పదు” అని రైతు ప్రజాసంఘాల సమాఖ్య జాతీయ అధ్యక్షుడు పోలాడి రామారావు, సీపీఐ జిల్లా కార్యదర్శి మర్రి వెంకట స్వామి రాష్ట్ర ప్రభుత్వాన్ని తీవ్రస్థాయిలో హెచ్చరించారు. రైతుల న్యాయమైన డిమాండ్ల సాధన కోసం కరీంనగర్ జిల్లా హుజురాబాద్ బస్టాండ్ సమీపంలోని అంబేద్కర్ చౌరస్తా వద్ద రైతు ప్రజాసంఘాల సమాఖ్య ఉమ్మడి జిల్లా నాయకుడు ముచ్చా సమ్మిరెడ్డి శనివారం నిరవధిక నిరాహార దీక్షకు కూర్చున్నారు. ఈ సందర్భంగా జరిగిన భారీ బహిరంగ సభలో నాయకులు ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టారు.
రాష్ట్ర ప్రభుత్వం రైతుల ప్రభుత్వం అని గొప్పలు చెప్పుకోవడం తప్ప, ఆచరణలో వారికి ఒరగబెట్టిందేమీ లేదని నాయకులు ధ్వజమెత్తారు. ముఖ్యంగా రైతు భరోసా నిధుల విడుదలలో జరుగుతున్న జాప్యాన్ని వారు తీవ్రంగా ఖండించారు. రైతు భరోసా కోసం కేటాయించిన 9 వేల కోట్ల రూపాయలలో, దాదాపు 4 వేల కోట్లను కాంట్రాక్టర్ల కమిషన్ల కోసం మళ్లించారని వస్తున్న ఆరోపణలపై ప్రభుత్వం సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. మరో 15 రోజుల్లో పంటలు కోతకు వస్తున్నా, ఇప్పటికీ పెట్టుబడి సాయం అందకపోతే రైతులు ఎలా బతకాలని ప్రశ్నించారు. ఈ నెల 16న అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమయ్యేలోగా రైతు భరోసా నిధులు విడుదల చేయకుంటే, వేలాదిమందితో అసెంబ్లీని ముట్టడిస్తామని పోలాడి రామారావు అల్టిమేటం జారీ చేశారు.
పాలనలో సోయి లేని పాలకులు – పొరుగు రాష్ట్రాల పాఠాలు
రాష్ట్రంలో నీటి వనరులు ఉన్నప్పటికీ, వాటిని సక్రమంగా నిర్వహించడంలో పాలకులు విఫలమయ్యారని నాయకులు విమర్శించారు. పొరుగు రాష్ట్ర సీఎం చంద్రబాబు నాయుడు వాటర్ మేనేజ్మెంట్లో దిట్ట అని, మన పాలకులు, అధికారులు అక్కడికి వెళ్లి ఆ పనితీరును స్టడీ చేసి నేర్చుకోవాలని హితవు పలికారు. పంటలకు నీరు లేక, గిట్టుబాటు ధర దక్కక రైతులు అల్లాడుతుంటే, యువతకు ఉపాధి లేక, మధ్యతరగతి ప్రజలు ఆర్థిక భారంతో సతమతమవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. రైతులే తమ పంటకు ధర నిర్ణయించుకునేలా జాతీయ స్థాయిలో చట్టం రావాలని, ఉపాధి హామీ పథకాన్ని తక్షణమే వ్యవసాయ రంగానికి అనుసంధానం చేయాలని డిమాండ్ చేశారు.
అన్నదాతల డిమాండ్లతో పాటు, ఆర్థికంగా వెనుకబడిన అగ్రకుల పేదల సంక్షేమం కోసం జాతీయ స్థాయి ఓసి కమిషన్ ఏర్పాటు చేయాలని, పెండింగ్లో ఉన్న వివిధ ఓసి కార్పొరేషన్లకు నిధులు, పాలకమండళ్లను తక్షణమే నియమించాలని వారు కోరారు. రైతు భీమా వయోపరిమితిని 70 ఏళ్లకు పెంచాలని, 50 ఏళ్లు నిండిన రైతులకు నెలకు 6 వేల రూపాయల పెన్షన్, మరియు 20 లక్షల వరకు ఉచిత వైద్య సదుపాయం కల్పించాలని ప్రధానంగా డిమాండ్ చేశారు. ఈ డిమాండ్ల సాధన కోసం ఏప్రిల్ 28న కరీంనగర్లో లక్ష మందితో “రాష్ట్ర స్థాయి రైతు మహాగర్జన సమరభేరి” సభను నిర్వహిస్తున్నట్లు ప్రకటించారు.
కిలోమీటర్ల మేర ర్యాలీ.. భారీగా తరలివచ్చిన రైతాంగం
దీక్షా ప్రారంభానికి ముందు హుజురాబాద్ బస్ డిపో నుండి అంబేద్కర్ చౌరస్తా వరకు సుమారు రెండు కిలోమీటర్ల మేర భారీ ర్యాలీ నిర్వహించారు. ఎద్దుల బండ్లు, మహిళల కోలాటాలు, డప్పు చప్పుళ్లు, యువకుల కేరింతల మధ్య సాగిన ఈ ర్యాలీలో జమ్మికుంట, వీనవంక, శంకరపట్నం, ఎల్కతుర్తి, భీందేవరపల్లి సహా పలు మండలాల నుండి రైతులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. రాష్ట్రంలో ప్రతిపక్షాల పాత్ర నామమాత్రంగా ఉన్నందున, తామే బాధ్యత తీసుకుని ప్రజా సమస్యలపై అలుపెరగని పోరాటం చేస్తామని పోలాడి రామారావు స్పష్టం చేశారు.
ఈ కార్యక్రమంలో రైతు మిత్ర ప్రజాసంఘాల రాష్ట్ర అధ్యక్షుడు గూడూరి స్వామి రెడ్డి, ప్రథాన కార్యదర్శి చందుపట్ల నరసింహ రెడ్డి, ఓసి జేఏసీ నాయకులు యెన్నం కిషన్ రెడ్డి, పెండ్యాల రాంరెడ్డి, బుర్ర శ్రీనివాస్ గౌడ్, మహిళా విభాగం చైర్మన్ కంకనాల సరిజన, లలిత రెడ్డి మరియు వివిధ రాజకీయ పార్టీల నాయకులు, న్యాయవాదులు, రైతు ప్రతినిధులు పాల్గొన్నారు.









