బాహు బలంన్యూస్ హుజూరాబాద్ మార్చి13 : పట్టణంలోని 29వ వార్డులో మున్సిపల్ చైర్పర్సన్ రొంటాల సుహసిని మరియు వార్డు కౌన్సిలర్ బోరగాల మొగిలి శుక్ర వారం పర్యటించారు. వార్డు పరిధిలోని అంగన్వాడీ కేంద్రాన్ని మరియు ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలను వారు సందర్శించి, అక్కడ అందుతున్న సేవలను క్షుణ్ణంగా పరిశీలించారు.
ముందుగా అంగన్వాడీ కేంద్రాన్ని సందర్శించిన చైర్పర్సన్, కేంద్రంలోని వంటగదిని మరియు నిల్వ ఉంచిన సరుకులను తనిఖీ చేశారు. గర్భిణీ స్త్రీలకు, బాలింతలకు మరియు చిన్న పిల్లలకు ప్రభుత్వం నిర్ణయించిన మెనూ ప్రకారం పౌష్టికాహారం సక్రమంగా అందుతుందో లేదో లబ్ధిదారులను అడిగి తెలుసుకున్నారు. “చిన్నారుల ఆరోగ్యం విషయంలో రాజీ పడకూడదని, ప్రతిరోజూ మెనూ ప్రకారం నాణ్యమైన ఆహారాన్ని అందించాలని” ఆమె ఈ సందర్భంగా సిబ్బందికి సూచించారు.
అనంతరం స్థానిక ప్రాథమిక పాఠశాలను సందర్శించి, విద్యార్థులకు వడ్డిస్తున్న మధ్యాహ్న భోజన నాణ్యతను పరిశీలించారు. వంటశాల పరిసరాలు శుభ్రంగా ఉంచుకోవాలని, విద్యార్థులకు రుచికరమైన భోజనాన్ని వడ్డించాలని వంట మనుషులకు దిశానిర్దేశం చేశారు. ఉపాధ్యాయులతో మాట్లాడి విద్యార్థుల విద్యా ప్రమాణాల గురించి అడిగి తెలుసుకున్నారు.
ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు బోరగాల కవిత, స్వర్ణలత, అంగన్వాడీ సూపర్వైజర్, టీచర్ రొంటాల పద్మ, ఆర్పీలు బోరగాల రమ, ఎర్ర వినోద, ఆశా వర్కర్ వసంత తదితరులు పాల్గొన్నారు.












