బాహు బలంన్యూస్ హుజురాబాద్,మార్చి 13:
రాష్ట్ర ప్రభుత్వం రైతులకు ఇచ్చిన హామీలను తక్షణమే నెరవేర్చాలని డిమాండ్ చేస్తూ కరీంనగర్ జిల్లా హుజురాబాద్ కేంద్రంగా పోరాటాన్ని ఉధృతం చేయాలని రైతు ప్రజాసంఘాల జేఏసీ నిర్ణయించింది. ఈ మేరకు రైతు ప్రజాసంఘాల జేఏసీ నాయకుడు ముచ్చా సమ్మిరెడ్డి శనివారం (మార్చి 14) ఉదయం 8 గంటల నుండి హుజురాబాద్లో నిరవధిక దీక్ష చేపట్టనున్నారు. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని రైతు ప్రజాసంఘాల సమాఖ్య జాతీయ అధ్యక్షుడు పోలాడి రామారావు రాష్ట్రవ్యాప్త రైతులకు, ప్రజాసంఘాలకు పిలుపునిచ్చారు.
ప్రభుత్వం రైతు పట్ల అవలంబిస్తున్న నిర్లక్ష్య వైఖరిని రామారావు తీవ్రంగా తప్పుపట్టారు. మరో 15 రోజుల్లో పంటలు కోతకు వచ్చే దశకు చేరుకున్నా, నేటికీ రైతు భరోసా నిధులు విడుదల చేయకపోవడం ప్రభుత్వ వైఫల్యానికి నిదర్శనమని విమర్శించారు. కేవలం సన్న రకాలకు మాత్రమే అడపా దడపా బోనస్ ఇస్తూ చేతులు దులుపుకోవడం సరికాదని, అన్ని రకాల ధాన్యాలకు కొనుగోలు సమయంలోనే రూ. 500 బోనస్ చెల్లించాలని ఆయన డిమాండ్ చేశారు. కౌలు రైతులకు ఇచ్చిన హామీలను సైతం అమలు చేయడంలో ప్రభుత్వం విఫలమైందని ఆరోపించారు.
రైతుల ప్రధాన డిమాండ్లు మరియు భవిష్యత్ కార్యాచరణ
రైతు సంక్షేమం కోసం ప్రభుత్వం తక్షణమే గిట్టుబాటు ధర కల్పించాలని, 50 ఏళ్లు దాటిన ప్రతి రైతుకు నెలకు రూ. 6,000 పెన్షన్ సౌకర్యం కల్పించాలని వారు డిమాండ్ చేశారు. అలాగే రైతు బీమా వయోపరిమితిని 70 ఏళ్లకు పెంచాలని, రైతులకు ఆరోగ్య సమస్యల నిమిత్తం రూ. 20 లక్షల పరిమితితో హెల్త్ కార్డులు మంజూరు చేయాలని కోరారు. ఓసీల సంక్షేమానికి ఏర్పాటు చేసిన కార్పొరేషన్లకు తక్షణమే పాలక మండళ్లను నియమించి, ప్రణాళిక పద్దు కింద రూ. 3,000 కోట్ల నిధులను కేటాయించాలని స్పష్టం చేశారు.
ప్రభుత్వం తమ డిమాండ్లపై స్పందించని పక్షంలో, మార్చి 16న వేలాది మంది రైతులతో శాంతియుత పద్ధతిలో అసెంబ్లీ గేటు ముట్టడి చేపడతామని పోలాడి రామారావు హెచ్చరించారు. అంతేకాకుండా, ఏప్రిల్ 28న కరీంనగర్లో లక్ష మందితో “రాష్ట్ర స్థాయి రైతు మహాగర్జన” సమరభేరి సభను నిర్వహించనున్నట్లు వెల్లడించారు. శనివారం హుజురాబాద్లో ప్రారంభమయ్యే ముచ్చా సమ్మిరెడ్డి నిరవధిక దీక్షకు పార్టీల కతీతంగా రైతులందరూ తరలివచ్చి సంఘీభావం తెలపాలని విజ్ఞప్తి చేశారు. ఈ సమావేశంలో రైతు మిత్ర ప్రజాసంఘాల రాష్ట్ర అధ్యక్షుడు గూడూరి స్వామి రెడ్డి, ప్రధాన కార్యదర్శి చందుపట్ల నరసింహ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.










