బాహు బలంన్యూస్ హుజూరాబాద్ ఫిబ్రవరి 05: మున్సిపల్ ఎన్నికల నగారా మోగడంతో హుజూరాబాద్లో రాజకీయ సందడి నెలకొంది. చైర్మన్ పీఠం దళిత మహిళకు రిజర్వ్ కావడంతో ప్రధాన పార్టీలన్నీ బలమైన అభ్యర్థుల వేటలో ఉన్నాయి. ఈ నేపథ్యంలో 30వ వార్డు కౌన్సిలర్ అభ్యర్థిగా రొంటాల సుహాసిని రంగంలోకి దిగి ముమ్మరంగా ప్రచారం నిర్వహిస్తున్నారు. ఉన్నత విద్యావంతురాలైన సుహాసిని, ప్రస్తుతం పోలీస్ శాఖలో ఉన్నత హోదాలో పనిచేస్తున్న ఓ కీలక అధికారికి స్వయానా సోదరి. ఆమె కుటుంబంలోని పలువురు సభ్యులు ప్రభుత్వ శాఖల్లో బాధ్యతలు నిర్వహిస్తూ సమాజంలో మంచి గుర్తింపు పొందడం సుహాసినికి సానుకూలాంశంగా మారింది.
వార్డు పర్యటనలో భాగంగా ఆమె మాట్లాడుతూ.. నిరుపేదలకు సేవ చేయాలనే లక్ష్యంతోనే తాను రాజకీయాల్లోకి వస్తున్నట్లు తెలిపారు. తొలుత 30వ వార్డు కౌన్సిలర్గా తనకు ఒక అవకాశం ఇచ్చి ఆశీర్వదించాలని, వార్డు అభివృద్ధికి నిరంతరం కృషి చేస్తానని ఆమె ప్రజలను కోరారు. కౌన్సిలర్గా విజయం సాధించిన అనంతరం చైర్మన్ పదవిని దక్కించుకుని మున్సిపాలిటీని ప్రగతి పథంలో నడిపిస్తానని ధీమా వ్యక్తం చేశారు.
ఈ కార్యక్రమంలో మాజీ కౌన్సిలర్ తోట రాజేంద్రప్రసాద్, కేసరి మధుకర్ రావు, దిల్ శ్రీనివాస్, ఎర్ర కుమార స్వామి, రేణిగుంట్ల సందీప్, చిట్యాల రేవంత్, మొలుగూరి రాధా తదితరులు పాల్గొని కాంగ్రెస్ పార్టీకి మద్దతు తెలపాలని కోరారు. విద్యావంతురాలైన సుహాసినిని గెలిపించుకుంటే వార్డు రూపురేఖలు మారుతాయని వారు ఈ సందర్భంగా ప్రజలకు విజ్ఞప్తి చేశారు.












