హుజూరాబాద్, ఫిబ్రవరి 04 (బాహుబలం న్యూస్): హుజూరాబాద్ మున్సిపల్ ఎన్నికల ప్రచార పర్వంలో 15వ వార్డు బీజేపీ అభ్యర్థి కూతాడి కుమారస్వామి తన ప్రచారాన్ని ముమ్మరం చేశారు. బుధవారం వార్డులో నిర్వహించిన భారీ ప్రచార కార్యక్రమంలో బీజేపీ జిల్లా అధ్యక్షులు గంగాడి కృష్ణారెడ్డి, పార్టీ సీనియర్ నాయకులు ముఖ్య అతిథులుగా పాల్గొని కుమారస్వామికి మద్దతుగా ఓటర్లను అభ్యర్థించారు. ఈ సందర్భంగా కూతాడి కుమారస్వామి ప్రతి ఇంటికీ వెళ్లి ప్రజల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ, తనకు ఒక్క అవకాశం ఇచ్చి ఆశీర్వదిస్తే వార్డులో ఉన్న డ్రైనేజీ, తాగునీరు, రోడ్ల వంటి అన్ని సమస్యలను పరిష్కరించి, వార్డును సమస్యల రహితంగా తీర్చిదిద్దుతానని హామీ ఇచ్చారు. అనాదిగా రాజకీయ ప్రాతినిధ్యానికి దూరంగా ఉన్న ఎరుకల సామాజిక వర్గం నుంచి మున్సిపల్ చరిత్రలోనే తొలిసారిగా ఒక అభ్యర్థి పోటీకి దిగడం ఆత్మగౌరవ పోరాటమని ఆయన పేర్కొన్నారు. జిల్లా అధ్యక్షులు గంగాడి కృష్ణారెడ్డి మాట్లాడుతూ, సామాజిక స్పృహ కలిగిన కుమారస్వామి వంటి నాయకుడిని గెలిపించుకోవడం ద్వారా వార్డు అభివృద్ధి సాధ్యమవుతుందని తెలిపారు. అట్టడుగు వర్గాలకు రాజకీయ గుర్తింపు దక్కాలనే లక్ష్యంతో బీజేపీ ఈ నిర్ణయం తీసుకుందని, ప్రజలు భారీ మెజారిటీతో గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో బీజేపీ సీనియర్ నాయకులు, పట్టణ నాయకులు, కార్యకర్తలు మరియు ఎరుకల సంఘం ప్రతినిధులు భారీ సంఖ్యలో పాల్గొని ప్రచారాన్ని విజయవంతం చేశారు.









