రాజకీయాల్లో యువతకు ప్రాధాన్యతనివ్వాలి: టీఎంపీఎస్ జిల్లా అధ్యక్షులు ఎర్ర కుమార్.

బాహు బలంన్యూస్ హుజూరాబాద్, జనవరి 21: రానున్న హుజూరాబాద్ మున్సిపల్ ఎన్నికలలో రాజకీయ పార్టీలన్నీ యువతకే పట్టం కట్టాలని, యువకులకే అత్యధిక స్థానాల్లో పోటీ చేసే అవకాశం కల్పించాలని తెలంగాణ మాదిగ పరిరక్షణ సమితి (TMPS) జిల్లా అధ్యక్షులు ఎర్ర కుమార్ డిమాండ్ చేశారు. బుధవారం ఆయన హుజూరాబాద్‌లో మీడియాతో మాట్లాడుతూ.. సమాజ మార్పు యువతతోనే సాధ్యమని, అందుకే అన్ని రాజకీయ పార్టీలు యువ నాయకత్వాన్ని ప్రోత్సహించాల్సిన అవసరం ఉందన్నారు.

దేశానికి వెన్నెముక లాంటి యువతను కేవలం ప్రచారానికి, పార్టీ జెండాలు మోయడానికే పరిమితం చేయకుండా, వారిని నిర్ణయాత్మక శక్తిగా ఎదగనివ్వాలని ఆయన సూచించారు. ప్రస్తుత రాజకీయ పరిస్థితుల్లో విద్యావంతులైన యువకులు చట్టసభలకు, స్థానిక సంస్థలకు ఎన్నికైతేనే ప్రజా సమస్యలపై సరైన అవగాహనతో పనిచేస్తారని అభిప్రాయపడ్డారు. హుజూరాబాద్ మున్సిపాలిటీ అభివృద్ధి చెందాలన్నా, వార్డుల్లోని సమస్యలు త్వరితగతిన పరిష్కారం కావాలన్నా ఉత్సాహవంతులైన యువతను బరిలోకి దించాలని కోరారు.

అన్ని ప్రధాన రాజకీయ పార్టీలు తమ అభ్యర్థుల ఎంపికలో యువతకు సముచిత స్థానం కల్పించాలని, యువకులకే సీట్లు కేటాయించి వారి రాజకీయ భవిష్యత్తుకు భరోసా ఇవ్వాలని ఎర్ర కుమార్ విజ్ఞప్తి చేశారు. యువతకు అవకాశం ఇస్తేనే ప్రజాస్వామ్యం బలోపేతం అవుతుందని ఆయన ఈ సందర్భంగా స్పష్టం చేశారు.

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :

బాహుబలం టివీ

 Don't Miss this News !