బాహు బలంన్యూస్ హుజూరాబాద్, జనవరి 12: హుజూరాబాద్ మున్సిపాలిటీ సమగ్రాభివృద్ధే లక్ష్యంగా భారతీయ జనతా పార్టీ ముందుకు సాగుతోందని, రాబోయే ఎన్నికల్లో మున్సిపల్ పీఠంపై కాషాయ జెండా ఎగరడం ఖాయమని బీజేపీ సీనియర్ నాయకులు పల్లెని దేవేందర్ రావు ధీమా వ్యక్తం చేశారు. సోమవారం స్థానికంగా ఏర్పాటు చేసిన కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఈ సందర్భంగా గత పాలకుల నిర్లక్ష్యంపై ఆయన తీవ్రస్థాయిలో మండిపడ్డారు. వనరులు ఉన్నప్పటికీ హుజూరాబాద్ను అభివృద్ధి చేయడంలో గత పాలకులు పూర్తిగా విఫలమయ్యారని విమర్శించారు.
పట్టణ అభివృద్ధి కోసం తన కార్యాచరణను ప్రకటిస్తూ.. స్థానిక మోడల్ చెరువును ‘ట్యాంక్ బండ్’ తరహాలో పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దుతామని హామీ ఇచ్చారు. పట్టణంలో ప్రధాన సమస్యలైన కోతుల బెడదను అరికడతామని, డ్రైనేజీ వ్యవస్థను ప్రక్షాళన చేస్తామని పేర్కొన్నారు. యువత కోసం మినీ స్టేడియం, అత్యాధునిక డిజిటల్ గ్రంథాలయం ఏర్పాటు చేస్తామన్నారు. ప్రజా ఆరోగ్యానికి పెద్దపీట వేస్తూ ప్రతి నెలా వార్డుల్లో ఉచిత వైద్య శిబిరాలు నిర్వహిస్తామని వెల్లడించారు. పార్టీ ఆదేశిస్తే 28వ వార్డు కౌన్సిలర్గా పోటీ చేసి భారీ మెజారిటీతో గెలుస్తానని దేవేందర్ రావు స్పష్టం చేశారు. హుజూరాబాద్ అభివృద్ధి కోసం ప్రజలు బీజేపీని ఆశీర్వదించాలని ఆయన పిలుపునిచ్చారు.











