హుజురాబాద్ బాహు బలంన్యూస్ జనవరి 12
కరీంనగర్ జిల్లా హుజురాబాద్కు చెందిన సీనియర్ జర్నలిస్ట్ మండల యాదగిరి పత్రికా రంగంలో గత 30 ఏళ్లుగా అందిస్తున్న విశిష్ట సేవలకు గుర్తింపుగా ‘రాష్ట్రస్థాయి సర్వోత్తమ సేవా పురస్కారం’ లభించింది. హైదరాబాద్లోని రవీంద్రభారతిలో మానవ విలువల పరిరక్షణ సేవా సంస్థ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో తెలంగాణ స్టేట్ పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ మాజీ చైర్మన్ కోలేటి దామోదర్ గుప్తా, అంతర్జాతీయ భారత్ వరల్డ్ రికార్డ్ గ్రహీత కదరి వెంకటరమణరావు తదితర ప్రముఖులు యాదగిరిని శాలువాతో సత్కరించి, అవార్డును ప్రదానం చేశారు.
ఈ సందర్భంగా అతిథులు మాట్లాడుతూ.. యాదగిరి సమాజ శ్రేయస్సే లక్ష్యంగా ఎన్నో ఆటుపోటులను ఎదుర్కొని నిస్వార్థంగా సేవలందిస్తున్నారని కొనియాడారు. ఆయన సేవలు సమాజానికి ఆదర్శప్రాయమని, భవిష్యత్తులో మరిన్ని ఉన్నత పురస్కారాలు అందుకోవాలని ఆకాంక్షించారు. ఇదే క్రమంలో 25 ఏళ్లకు పైగా పత్రికా రంగంలో కొనసాగుతున్న జర్నలిస్టులకు ప్రభుత్వం తగిన ఆర్థిక సహాయం, జీవనోపాధి కల్పించాలని వారు కోరారు. ఈ కార్యక్రమంలో సంస్థ అధ్యక్షులు నాగుల సత్యం గౌడ్, డాక్టర్ శివ నాగార్జున రెడ్డి, నటి ఐశ్వర్య తదితరులు పాల్గొన్నారు.










