బాహు బలంన్యూస్ హుజురాబాద్, జనవరి 09:
హుజురాబాద్ పట్టణంలోని రంగనాయకుల గుట్టపై కొలువై ఉన్న వనదేవతలు సమ్మక్క-సారలమ్మ జాతర మహోత్సవాల నిర్వహణకు గాను ఉత్సవ కమిటీ డైరెక్టర్గా గాలిబు సురేష్ ఎన్నికయ్యారు. ఈ నెల 28, 29, 30, 31 తేదీల్లో మొత్తం నాలుగు రోజుల పాటు అత్యంత వైభవంగా జరగనున్న ఈ జాతర ఏర్పాట్లను పర్యవేక్షించే బాధ్యతను ఆయనకు అప్పగించారు. ఈ సందర్భంగా గాలిబు సురేష్ మాట్లాడుతూ.. తన ఎన్నికకు పూర్తిస్థాయిలో సహకరించి, ఈ బాధ్యతను ఇప్పించిన హుజురాబాద్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జ్ వొడితల ప్రణవ్ కు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు. తనపై నమ్మకం ఉంచి సేవ చేసే అవకాశం కల్పించిన వొడితల ప్రణవ్ కు తాను ఎల్లప్పుడూ రుణపడి ఉంటానని ఈ సందర్భంగా స్పష్టం చేశారు.
నాలుగు రోజుల పాటు సాగే ఈ మహా జాతరకు నియోజకవర్గంలోని వివిధ గ్రామాల నుండి భక్తులు భారీగా తరలివచ్చే అవకాశం ఉన్నందున, వారికి ఎటువంటి అసౌకర్యం కలగకుండా అన్ని రకాల ఏర్పాట్లు చేస్తామని గాలిబు సురేష్ పేర్కొన్నారు. తాగునీరు, క్యూలైన్లు, భక్తుల రక్షణ వంటి అంశాలపై ప్రత్యేక దృష్టి సారిస్తామని, వనదేవతల ఆశీస్సులు ప్రజలందరికీ అందేలా ఉత్సవాలను ఘనంగా నిర్వహిస్తామని తెలిపారు. తనకు ఈ అవకాశం దక్కేలా సహకరించిన వొడితల ప్రణవ్ తో పాటు కమిటీ సభ్యులకు ధన్యవాదాలు తెలిపారు.










