హుజురాబాద్ బాహు బలంన్యూస్ జనవరి 01: మండల పరిధిలోని రంగాపూర్ కల్వరి టెంపుల్లో నూతన సంవత్సర ఆరాధన మహోత్సవం అత్యంత వైభవంగా నిర్వహించబడింది. చర్చి వ్యవస్థాపకులు రెవ. డాక్టర్ పి.ఆర్. నెల్సన్ నేతృత్వంలో జరిగిన ఈ వేడుకలకు భక్తులు భారీ సంఖ్యలో తరలివచ్చారు. ఈ కార్యక్రమానికి గుంటూరుకు చెందిన ప్రముఖ దైవజనులు రెవ. డాక్టర్ చెల్లీ అశోక్ కుమార్ ముఖ్య అతిథిగా హాజరై భక్తులకు వాక్య సందేశాన్ని అందించారు. క్రీస్తు జననం ఆధారంగానే ప్రపంచ క్యాలెండర్లు రూపుదిద్దుకున్నాయని, ఆయన చూపిన ప్రేమ, శాంతి మార్గాలే నేటి సమాజానికి దిక్సూచి అని ఆయన పేర్కొన్నారు.
ఈ సందర్భంగా నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు భక్తులను విశేషంగా ఆకట్టుకున్నాయి. చర్చి క్వయర్ బృందం కీర్తనలు ఆలపించగా, పిల్లలు, యువతీ యువకులు ప్రదర్శించిన నృత్యాలు, నాటికలు అలరించాయి. సేవా కార్యక్రమంలో భాగంగా పంచాయతీ కార్యదర్శి బండ ప్రసాద్ సౌజన్యంతో ఏర్పాటు చేసిన చీరలను పేద మహిళలకు అతిథుల చేతుల మీదుగా పంపిణీ చేశారు. అనంతరం ఫాదర్ నెల్సన్ దంపతులు అతిథులతో కలిసి కేక్ కట్ చేసి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు. చివరగా నూతన సంవత్సర క్యాలెండర్లను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో చర్చి కమిటీ సభ్యులు మరియు గ్రామస్తులు పాల్గొన్నారు.














