బాహు బలంన్యూస్ హుజూరాబాద్ డిసెంబర్ 14 : హుజూరాబాద్ నియోజకవర్గ కాంగ్రెస్ ఇన్ఛార్జి వొడితల ప్రణవ్ సొంత గ్రామమైన సింగాపురం గ్రామ పంచాయతీ ఎన్నికలు ఇప్పుడు పార్టీలో తీవ్ర సంక్షోభానికి దారి తీశాయి. జరగబోయే ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ స్పష్టంగా రెండు వర్గాలుగా చీలిపోయింది.
సింగాపురంలో కాంగ్రెస్ వర్గాలు ముక్కలవడం ప్రధాన చర్చనీయాంశంగా మారింది. ఒక వర్గం ఇన్ఛార్జి వొడితల ప్రణవ్, కౌరు సుగుణాకర్ రెడ్డిల మద్దతుతో కల్వల సంపత్ కుమార్ను సర్పంచ్ అభ్యర్థిగా బలపరుస్తుండగా, దీనికి భిన్నంగా రెండవ వర్గం నాయకులు గుడిపాటి సరిత జయపాల్ రెడ్డిల నేతృత్వంలో నీరటి రవిని రంగంలోకి దించింది.
సర్పంచ్ పదవికి మొత్తం తొమ్మిది మంది అభ్యర్థులు పోటీపడుతున్నప్పటికీ, ప్రధాన పోరు మాత్రం ఈ రెండు కాంగ్రెస్ వర్గాల అభ్యర్థుల మధ్యే రసవత్తరంగా నడుస్తోంది. సింగాపురంపై ఒక వర్గానికి ఉన్న పట్టును సొంత పార్టీ శక్తే చీల్చివేస్తుండటంతో, రాజకీయ చర్చ స్థానికుల్లో బలంగా వినిపిస్తోంది.
మరోవైపు, గుడిపాటి సరిత జయపాల్ రెడ్డిల మద్దతు ప్రకటించిన నీరటి రవి అభ్యర్థిత్వం జోరుగా దూసుకుపోతోంది. ఆయన విజయ అవకాశాలు మెరుగ్గా ఉన్నాయని, గ్రామ ప్రజల మద్దతు అందిపుచ్చుకుని గెలుపు అంచున నిలిచారని విశ్వసనీయ సమాచారం. గుడిపాటి సరిత జయపాల్ రెడ్డి గ్రామ ప్రజలకు చేసిన సేవలను గుర్తుంచుకుని, వారు నిలబెట్టిన అభ్యర్థిని గెలిపించడానికి ప్రజలు సానుకూలంగా ఉన్నట్లు గ్రామ ప్రజలలో బలంగా చర్చలు వినిపిస్తున్నాయి.
సొంత గూటిలోనే ఇంతటి అంతర్గత పోరు జరుగుతున్నప్పటికీ, కాంగ్రెస్ అగ్ర నాయకత్వం ప్రేక్షక పాత్ర వహించడం విమర్శలకు దారి తీస్తోంది. ఈ ఉత్కంఠభరితమైన పోరులో విజేత ఎవరన్నది తేలాలంటే ఎన్నికల ఫలితం వెలువడే వరకు వేచి చూడక తప్పదు. గ్రామ రాజకీయాలపై ఈ వర్గపోరు ఎలాంటి ప్రభావాన్ని చూపుతుందోనని సింగాపురం ప్రజలు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.










