బాహు బలంన్యూస్ వరంగల్ , సెప్టెంబర్ 08 :ఈ నెల 14న జరగనున్న జాతీయ మెగా లోక్ అదాలత్ను కక్షిదారులు సద్వినియోగం చేసుకోవాలని వరంగల్ పోలీస్ కమిషనర్ సన్ ప్రీత్ సింగ్ సూచించారు. రాజీయే రాజమార్గమని ఆయన అన్నారు.ఈ సందర్భంగా పోలీస్ కమిషనర్ మాట్లాడుతూ, చిన్నపాటి కేసుల విషయంలో కక్షలు పెంచుకుని కోర్టుల చుట్టూ తిరుగుతూ సమయాన్ని, డబ్బును వృథా చేసుకోవద్దని కోరారు. జుడిషియల్ డిపార్ట్మెంట్ కల్పించిన ఈ అవకాశాన్ని ప్రతి ఒక్కరూ ఉపయోగించుకోవాలన్నారు.
లోక్ అదాలత్లో రాజీ పడదగిన క్రిమినల్ కేసులు, సివిల్ తగాదాలు, ఆస్తి విభజన, కుటుంబ మరియు వైవాహిక సంబంధిత కేసులు, బ్యాంకు రికవరీ, విద్యుత్ చౌర్యం, చెక్ బౌన్స్ వంటి కేసులను పరిష్కరించుకోవచ్చని ఆయన తెలిపారు.కేసుల్లో రాజీ కుదిర్చేందుకు జిల్లాలోని పోలీస్ అధికారులు ఇరువర్గాలకు కౌన్సిలింగ్ ఇచ్చి అవగాహన కల్పిస్తారని చెప్పారు. ఎవరైనా తమ కేసుల్లో రాజీ కావాలనుకుంటే పోలీస్ అధికారులను సంప్రదించవచ్చని, లోక్ అదాలత్ ద్వారా బాధితులకు త్వరగా న్యాయం జరుగుతుందని ఆయన తెలియజేశారు.










